పడుకోవడం విషయంలో గొడవ.. కూతురిని 25సార్లు దారుణంగా కత్తితో పొడిచి చంపిన తండ్రి.. !
ఇంటి గొడవల కారణంగా సూరత్కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను 25 సార్లు కత్తితో పొడిచాడు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూరత్ : ఇంటి గొడవల కారణంగా సొంత కూతురిమీద కత్తితో దాడిచేశాడో తండ్రి. ఆమెను కనీసం 25 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఆమె చనిపోయింది. అడ్డువచ్చిన భార్యను గాయపరిచాడు. ఈ కేసులో సూరత్కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
మే 18వ తేదీ రాత్రి సూరత్లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత అతని భార్య రేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.
రామానుజ అనే నిందితుడు తన కుటుంబంతో కలిసి సూరత్లోని సత్య నగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుమార్తె టెర్రస్పై పడుకోవడం విషయంపై భార్యతో జరిగిన చిన్నపాటి వాదనలో నిందితుడు సహనం కోల్పోయాడు. పరిస్థితి విషమించడంతో హింసకు దారితీసింది.
సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నట్లుగా, సుమారు రాత్రి 11.20 గంటలకు, రామానుజు మొదట తన పిల్లల ముందే భార్యతో గొడవకు దిగాడు. ఆ తరువాత ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మహిళ గాయపడగా, పిల్లలు అతడిని వారించడానికి, దాడిచేయకుండా ఉండడానికి గట్టిగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. ధైర్యంగా అతడిని కాసేపు నిలవరించారు. అతన్ని లొంగదీసుకున్నారు. అయితే, రామనుజ కాసేపటికి వారి పట్టు విదిలించుకున్నాడు. అందుబాటులో ఉన్న వారిపై దాడికి ప్రయత్నించాడు.
ప్రధాని మోడీ దేవుడితో కూర్చుంటే.. విశ్వం ఎలా పనిచేస్తుందో ఆయనకే వివరిస్తారు - రాహుల్ గాంధీ
ఈ గందరగోళం మధ్య, నిందితుడు తన కుమార్తెను ఒడిసి పట్టుకున్నాడు. ఆ తరువాత ఆమెను అనేకసార్లు కత్తితో దారుణంగా నరికాడు. దీంతో మిగతావారంతా భయాందోళనలతో పారిపోయారు. మళ్లీ భార్య తిరిగి రావడంతో.. ఆమెమీద దాడి చేయడానికి మెట్లమీదికి వెళ్లాడు.. ఈ సమయంలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతని పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సమీపంలోని గదిలోకి పాక్కుంటూవెళ్లింది కూతురు. అయినా ఆమెను వదలకుండా గదిలోకి వెళ్లి... ఆమెను కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. దీంతో ఆమె మృతి చెందింది.
తన కుమార్తెపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత కూడా, రామానుజు తన భార్యకు కూడా హాని చేయాలని నిశ్చయించుకుని డాబాపైకి ఎక్కాడు. తమ తల్లిని రక్షించడానికి పిల్లలు జోక్యం చేసుకున్నారు. దీంతో రామానుజ దాడిలో వారికి కూడా గాయాలయ్యాయి.
ఇది వెలుగు చూడడంతో సూరత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికారులు వేగంగా రామానుజను పట్టుకున్నారు. హత్యాయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్య, హత్యాయత్నం సహా ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కేసుపై ప్రధాన పరిశోధకుడు ఇన్స్పెక్టర్ ఆర్కె పటేల్ తెలిపారు. విచారణ కొనసాగుతుండగా, అధికారులు బాధితురాలు, ఫిర్యాదుదారు రేఖ నుండి వాంగ్మూలాలు తీసుకున్నారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు.