మహిళను చంపి.. ఫోన్ పారేయడానికి ఉత్తరాఖండ్ వెళ్లాలని ప్లాన్... చివరికి...
నర్సు అనురాధరెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆమెను అతి దారుణంగా హత్య చేసిన చంద్రమోహన్ ఆ తరువాత ఆమె ఫోన్ పారేయడానికి ఉత్తరాఖండ్ వెళ్లాలనుకున్నాడని సమాచారం.
హైదరాబాద్ : హైదరాబాద్ లో కలకలం సృష్టించిన వై.అనురాధారెడ్డి హత్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెను హత్య చేసిన తరువాత ఆ విషయం వెలుగులోకి రాకుండా ఉండాలని.. ఉత్తరాఖండ్కు వెళ్లి బాధితురాలి మొబైల్ను అక్కడ వదిలేయాలనుకున్నాడు. దీంట్లో భాగంగానే అనురాధారెడ్డిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్ నుంచి తాను ‘చార్ ధామ్’ యాత్రకు వెడుతున్నట్లుగా ఆమె కూతురికి, తెలిసిన వారికి మెసేజ్ లు చేశాడు.
ఈ మేరకు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే...మే 15వ తేదీన మలక్ పేట మూసీనది తీరంలో ఓ ప్లాస్టిక్ కవర్లో మహిళతల రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిమీద తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు వారం రోజుల తరువాత కేసును ఛేదించారు. మృతురాలిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హెడ్ నర్సుగా పనిచేస్తున్న వై.అనురాధారెడ్డిదిగా గుర్తించారు.
ఆమెను 15యేళ్లుగా సహజీవనం చేస్తున్న చంద్రమోహన్ ఈ హత్య చేసినట్టుగా గుర్తించారు. అంతేకాదు అతని ఇంట్లోని ఫ్రిజ్ లో.. ఆమె మిగతా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. 55 ఏళ్ల అనురాధను 48 ఏళ్ల నిందితుడు.. ఆ తరువాత ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. ఆ తరువాత ఆమె ఫోన్ తో ఆమె కూతురికి, స్నేహితులకు చార్ ధామ్ యాత్రకు వెడుతున్నట్లుగా మెసేజ్ పెట్టాడు.
ముక్కలుగా చేసిన ఆమె మృతదేహాన్ని వివిధ చోట్ల పారవేయగలననే నమ్మకంతో ఉన్న నిందితుడు, ఉత్తరాఖండ్కు వెళ్లి ఆమె ఫోన్ను వదిలిపెట్టి, అక్కడే ఆమె కనిపించకుండా పోయిందని చెప్పాలని ప్లాన్ చేశాడు. నిందితుడు చంద్రమోహన్ ఆమె నుంచి 20 తులాల బంగారం, రూ. 7 లక్షలకుపైగా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె పట్టుబట్టడంతో, నిందితుడు మొదట్లో చైతన్యపురిలోని తన ఇంటిని ఆమె పేరు మీద బదిలీ చేస్తానని హామీ ఇచ్చాడు, కానీ అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు.
అనురాధరెడ్డి హత్య కేసు : పదిహేనేళ్లుగా సహజీవనం.. రూ.7లక్షల కోసం కిరాతకంగా హత్య..
మోహన్తో రిలేషన్షిప్లో ఉన్న అనురాధ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మాట్రిమోనీలో ఒక ప్రకటన కూడా ఇచ్చింది.
“ఈ ప్రకటన మోహన్ని మరింత చికాకు పెట్టింది. డబ్బు, బంగారం కోసం ఆమె అతనిపై ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో.. అతను ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు”అని పోలీసులు తెలిపారు. ఈ పథకంలో భాగంగానే మే 12న అనురాధను పదే పదే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం స్టోన్ కట్టర్ తో మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు సమాచారం.
నరికిన తలను నిందితుడు రెండు రోజుల పాటు తన నివాసంలో ఉంచి ఆ తర్వాత మలక్పేటలో పడేశాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కొన్న దుకాణ యజమానిని రానున్న రోజుల్లో పోలీసులు విచారించనున్నారు. నరికిన తలను విడిచిపెట్టిన ప్రదేశానికి వెళ్లేందుకు నిందితుడు ఉపయోగించిన ఆటో డ్రైవర్ను కూడా గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అతను తలను పడవేస్తున్న సమయంలో అక్కడే ఆగి ఉన్న బస్సు అడ్డుగా ఉండడంతో.. బాటసారులు అతడిని అనుమానించే అవకావం లేకుండా పోయిందని పోలీసులు తెలిపారు. బాధితుడి తలను పడేసిన రెండు రోజులకు అనగా మే 17నజీహెచ్ఎంసీ శానిటరీ కార్మికులకు కవర్తో తల కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
హత్య వేరే ప్రదేశంలో జరగడంతో మలక్పేట పోలీసులు కేసును చైతన్యపురి పోలీసులకు బదిలీ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ఎల్బీ నగర్లోని సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
పోలీసులు అతని కోసం వెతికే సరికి తాను తన దగ్గరున్న శరీర భాగాలన్నింటినీ డిస్పోజ్ చేస్తాననుకున్నాడు. దీంతో తాను తప్పించుకుంటానని నమ్మకంగా ఉన్నాడు ఈ కేసుపై మీడియా కథనాలను అనుసరించాడు.
ఇక మరోవైపు బాధితురాలు అనురాధరెడ్డి కొన్నాళ్లుగా బంధువులతో టచ్లో లేదు. విచారణాధికారులు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం తెలిసిందన్నారు.