Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. ప్రియురాలిని చంపి, నన్ను మోసం చేయద్దు అంటూ మృతదేహంతో వీడియో...

మధ్యప్రదేశ్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రియుడు.. ఆ మృతదేహంతో వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

man kills girlfriend, taken video with dead body post on Instagram in Madhya Pradesh
Author
First Published Nov 17, 2022, 2:05 PM IST

మధ్యప్రదేశ్ : దేశవ్యాప్తంగా ఇంకా ప్రకంపనలు సృష్టిస్తోన్న శ్రద్ధావాకర్ హత్యోదంతాన్ని ఇంకా మరువకముందే మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ లోని పాటన్ కు వలస వచ్చిన అభిజిత్ పాటిదార్.. ఈ నెల 8న జబల్ పుర్ రిసార్టులో తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాంతో వీడియో తీసుకున్నాడు. దాన్ని ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేశాడు. 

ఇది వెలుగులోకి వచ్చినా పోలీసులు మాత్రం ఇంకా అతడిని అరెస్ట్ చేయలేదు. ‘నిందితుడు రక్తపు మడుగులో ఉన్న యువతిని వీడియోలో చూపిస్తూ తనను మోసం చేయవద్దని వ్యాఖ్యానించాడు. మృతురాలిని జబల్ పుర్ జిల్లా కుందాం ప్రాంతానికి చెందిన శిల్పా ఝరియా (22)గా గుర్తించాం. ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరించాం. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపాం’ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వికాస్ వాకర్ హత్య కేసులో దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్  ఓ పక్క ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్లో ఉంచి..  మరో యువతిని పలుమార్లు తన అపార్ట్ మెంట్ కు పిలిచినట్లు తేలింది. మరోవైపు ఓ వెబ్ సిరీస్ ను ఇంటర్నెట్లో చదివి.. శవాన్ని ఆనవాలు లేకుండా  మాయం చేశాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు, డేటింగ్ యాప్ ను వాడి పలువురు మహిళలను కూడా అతడు కలిసినట్లు తెలుస్తోంది. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా… ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు.

శ్రద్ధా వాకర్ హత్య కేసు : పోలీసులకు సవాల్ గా మారిన సాక్ష్యాల సేకరణ..

నిందితుడు ఆఫ్తాబ్ ‘డెక్స్ టర్’ పేరిట వచ్చే ఓ సీరియల్ కిల్లర్ ఆంగ్ల వెబ్ సిరీస్, ఇతర క్రైం సిరీస్ లను చూసేవాడు. మే 18వతేదీన శ్రద్ధా- ఆఫ్తాబ్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆఫ్తాబ్ ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తరువాత అతను చూసే క్రైమ్ షోల్లో లాగా, ఆమె మృతదేహాన్ని నరికి, ఫ్రిజ్లో భద్రపరిచాడు. శరీరాన్ని ముక్కలు చేయడం కోసం అతడు హ్యూమన్ అనాటమీ చదివాడు. 

ఇంట్లో ఎటువంటి వాసన రాకుండా రోజూ అగరబత్తీలు వెలిగించేవాడు. ఫ్రిజ్లో దాచి పెట్టిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసేవాడు. త్వరగా దెబ్బతింటున్న శరీర భాగాలను మొదట పారేసేవాడు. పోలీసులు  అతను వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. రక్తాన్ని ఎలా శుభ్రం చేయాలి,  మానవ శరీర నిర్మాణం  ఎలా  ఉంటుంది..  అనే అంశాలను అతను చదివినట్లు గూగుల్ హిస్టరీలో బయటపడింది.

శ్రద్ధ శవం ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉండగానే.. ఆఫ్తాబ్ మరో యువతిని తన అపార్ట్ మెంట్ కు తీసుకువచ్చాడు. ఆఫ్తాబ్ ఈ విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఓ ఆన్లైన్ డేటింగ్ యాప్ ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. గతంలో ఇదే యాప్ లో శ్రద్ధాతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ యాప్ లోనే మరో యువతికి ఎరవేశాడు. ఆమె ఓ సైకాలజిస్ట్. ఆమె జూన్, జూలైలో పలుమార్లు అతడు ఇంటికి వచ్చి వెళ్ళింది. అప్పటికి ఆ అపార్ట్మెంట్ కిచెన్ లోని ఫ్రిజ్ లో శ్రద్ధా శరీర అవయవాలు ఇంకా ఉన్నాయి.

మరోవైపు శ్రద్ధ సజీవంగా ఉందని అందరినీ నమ్మించేందుకు ఆఫ్తాబ్ ఆమె సోషల్ మీడియా అకౌంట్లోకి లాగిన్ అయ్యేవాడు. దీంతోపాటు ఆమె క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించేవాడు. కొన్ని సందర్భాల్లో ఆమె మిత్రులకు మెసేజీలు చేసేవాడు. కాకపోతే ఫోన్ స్విచాఫ్ రావడం, సోషల్ మీడియా అప్డేట్ లేకపోవడం వంటి వాటితో శ్రద్ధ మిత్రులకు  అనుమానం వచ్చి ఆమె ఇంట్లో తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios