జార్ఖండ్‌లో ఓ వ్యక్తి తన ఫ్రెండ్‌ ఫోన్ దొంగిలించాడని అనుమానించాడు. తన ఫోన్ ఇచ్చేయాలని అడగ్గా.. తాను దొంగిలించలేదని సమాధానం వచ్చింది. దీంతో అతడిని కాల్చేశాడు.  

న్యూఢిల్లీ: ఫోన్ నేడు నిత్యజీవితంలో భాగమైపోయింది. నిద్ర పోయే ముందు చివర చేసే పని, నిద్రలేవగానే తొలిగా చేసే పని ఫోన్ స్క్రీన్ చూడటం చాలా మంది దినచర్యలో భాగమైపోయింది. అయితే, ఆ ఫోన్ సన్నిహితుడికి ప్రాణాంతకమవుతుందని అప్పటి వరకు వారికి తెలియదు. తన మిత్రుడే ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో ఓ హత్యకు దారి తీసింది. జార్ఖండ్‌లోని జంషేడ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

విశాల్ ప్రసాద్, అభిషేక్ లాల్‌లు ఇద్దరు మిత్రులు. 25 ఏళ్ల అభిషేక్ లాల్ ఫోన్ చోరీకి గురైంది. ఫోన్‌ను దొంగిలించింది మిత్రుడు విశాల్ ప్రసాద్ అని అభిషేక్ లాల్ అనుమానించాడు. శనివారం ఉదయమే విశాల్ ఇంటికి అభిషేక్ వెళ్లాడు. తన నుంచి దొంగిలించిన ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని విశాల్‌ను కటువుగా అడిగాడు. తాను ఆ ఫోన్ తీయలేదని విశాల్ చెప్పాడు. తాను తీయలేదని అభిషేక్‌ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, అభిషేక్ ఆయన వాదనను అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాదం పెరిగింది.

Also Read: మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసుల దుర్మరణం

శనివారం రాత్రి కూడా అభిషేక్ విశాల్‌కు ఫోన్ చేశాడు. విశాల్‌ను రామదాస్ భట్టా ఏరియాకు తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లాక విశాల్ చాతిలో అభిషేక్ బుల్లెట్ దింపాడు. 

విశాల్‌ను టాటా మెయిన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆయన గాయాలతో మరణించాడు. పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. అభిషేక్‌ను అరెస్టు చేయడానికి గాలింపులు జరుపుతున్నారు.