టీకా భయం.. తను వేయించుకోకపోగా, భార్య ఆధార్తో రోజంతా చెట్టుపైనే
వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని.. చచ్చిపోతామంటూ జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు బలవంతంగా టీకా వేద్దామని ప్రయత్నించినా వారిని తరిమితరిమి కొడుతున్నారు ప్రజలు
కరోనా వైరస్ సెకండ్ వేవ్తో భారతదేశం అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలను చూసిన మనదేశంలో ఇప్పుడిప్పుడే పరిస్ధితి అదుపులోకి వస్తోంది. అయితే థర్డ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇందుకు పరిష్కారం వ్యాక్సిన్ ఒక్కటేనని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్కు పెద్ద పీట వేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ప్రజల్లో టీకాపై భయం పోలేదు. వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని.. చచ్చిపోతామంటూ జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు బలవంతంగా టీకా వేద్దామని ప్రయత్నించినా వారిని తరిమితరిమి కొడుతున్నారు ప్రజలు.
Also Read:బీహార్ లో దారుణం : ఐదు నిమిషాల తేడాతో మహిళలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్..
తాజాగా మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా పతంకాలన్ గ్రామానికి చెందిన కన్వర్లాల్ అనే వ్యక్తి కరోనా టీకాకు భయపడి చెట్టెక్కేశాడు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్ టీకా శిబిరం నిర్వహించడానికి ఆరోగ్య శాఖ బృందం పతంకాలన్ గ్రామానికి వచ్చింది. దీనిలో భాగంగా వ్యాక్సిన్ కోసం టీకా శిబిరానికి రావాల్సిందిగా గ్రామస్తులందరిని అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో కన్వర్లాల్ కూడా టీకా కేంద్రానికి వచ్చాడు. కానీ వ్యాక్సిన్ వేయడం చూసి భయపడి దగ్గరలో వున్న చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన భార్య టీకా తీసుకోవడానికి అంగీకరించినప్పటికీ.. అతడు ఆమె ఆధార్ కార్డు కూడా తనతో పాటు తీసుకెళ్లడంతో ఆమె కూడా కరోనా టీకా వేయించుకోలేకపోయింది.
దీనిపై ఖుజ్నర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తెలిసి గ్రామాన్ని సందర్శించి కన్వర్లాల్కు సలహా ఇచ్చానని చెప్పారు. కౌన్సిలింగ్ తర్వాత అతని భయం పోయిందని... మరోసారి గ్రామంలో టీకా శిబిరం జరిగినప్పుడు తాను, తన భార్య టీకాలు తీసుకుంటామని చెప్పాడని ఆయన అన్నారు.