మూడేళ్ల క్రితం కోల్‌కతాలోని అలీపూర్ జంతుప్రదర్శనశాలలో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకి, సింహం దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించి, తీవ్రంగా గాయపడ్డాడో వ్యక్తి. 

కోల్‌కతా : బెంగాల్‌లో ఓ వ్యక్తి వీధుల్లో భయోత్పాతం సృష్టించాడు. తన భార్య తల నరికి.. దాన్ని చేతిలో పట్టుకుని వీధుల వెంబడి తిరిగాడు. అతను ఒక చేతిలో నరికిన తల, మరొక చేతిలో కొడవలితో బస్టాప్‌లో తిరుగుతూ.. అస్పష్టంగా ఏవో బెదిరింపు వ్యాఖ్యలు చేస్తూ తిరగడం కనిపించింది. అతని శరీరం రక్తంలో తడిసిపోయింది. నరికిన తలను చేతితో పైకెత్తి చూపిస్తూ.. తన చుట్టూ గుమికూడిన జనంపై అరుస్తూ ఉన్నాడు.

ఫిబ్రవరి 14న పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆ రోజు ప్రేమికుల రోజు, సరస్వతి పూజ రోజు కూడా. చాలా మంది సరస్వతి పూజలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఈ ఘటన వెలుగు చూడడంతో భయాందోళనలకు గురయ్యారు. గౌతమ్ గుచ్చైత్ అనే 40 ఏళ్ల ఈ నిందితుడిని అరెస్టు చేశారు.

ఆ తరువాత పోలీసులు మాట్లాడుతూ.. ఆ వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా భార్య తల నరికి చంపాడని పోలీసులు తెలిపారు. భార్యను దారుణంగా హతమార్చిన తరువాత సమీపంలోని బస్టాప్‌కు వెళ్లి నరికిన తలతో తిరుగుతూనే ఉన్నాడు. ఈ భయానక దృశ్యాన్ని స్థానికులు మొబైల్ కెమెరాల్లో బంధించారు. గంట తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు భార్య ఫుల్రానీ గుచ్చైత్ మృతదేహాన్ని గుర్తించారు. 

గౌతమ్‌ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతని తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతని మానసిక స్థితి సరిగా లేదని అతని తల్లిదండ్రులు గతంలో పేర్కొన్నారు.

మూడేళ్ల క్రితం కోల్‌కతాలోని అలీపూర్ జంతుప్రదర్శనశాలలో గౌతమ్ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. అతను 14 అడుగుల సరిహద్దు గోడను ఎక్కి రెండు నెట్ ఫెన్సింగ్‌లను దాటి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తన గుహలోంచి బయటకు వచ్చిన సింహం దగ్గరికి వెళ్లడానికి నేల మీద పాకుతూ వెళ్లాడు.