భార్య, మూడేళ్ల కూతురు తలలు నరికి హత్య.. బిహార్లో దారుణం.. అసలు ఏం జరిగిందంటే..
బిహార్లోని మాధేపురా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి.. తన భార్య, కూతురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పదునైన ఆయుధంతో వారి తలలు నరికి చంపేశాడు.
బిహార్లోని మాధేపురా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి.. తన భార్య, కూతురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పదునైన ఆయుధంతో వారి తలలు నరికి చంపేశాడు. అనంతరం తన కొడుకు, మరో కూతురుతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని రామ్నగర్ మహేష్ పంచాయతీలోని పోఖారియా గ్రామానికి చెందిన మహ్మద్ జుబేర్ ఆలంగా గుర్తించారు. వివరాలు.. ఆలం తన భార్య ముర్షిదా ఖాతూన్ (30), మూడే ళ్ల కూతురు జియా పర్వీన్లను తలలను నరికి హత్య చేశాడు.
హత్య అనంతరం భార్య ముర్షిదా తలను భర్రాహి పోలీసు అవుట్ పోస్టు పరిధిలోని గోధైలా గ్రామంలోని ఆమె పుట్టింటికి తీసుకెళ్లి అక్కడ విసిరేశాడు. ‘‘యే లో రఖ్ లో అప్నీ లడ్లీ కో’’ అని చేతితో రాసిన ఓ నోట్ను కూడా తల వద్ద పడేశాడు. హత్య చేసిన తర్వాత ఓ వీడియోను రికార్డు చేసిన ఆలం.. దానిని వాట్సాప్ గ్రూప్ల్లో షేర్ చేశాడు. ఈ ఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే పోఖారియా గ్రామంలోని ఆలం ఇంటికి చేరుకున్నారు.
అక్కడ ముర్షిదా కత్తిరించిన మొండం, జియా తల, మెండంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్టుమార్టమ్ నిమిత్తం మాధేపురాకు పంపినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకన్న ముర్షిదా బంధులు.. ఆలంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఆగ్రహంతో చాందినీ చౌక్ గోధైలా గ్రామంలో ఆందోళనకు దిగారు. ఎన్హెచ్ 107పై నిరసనకు దిగి.. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో.. వారు రహదారిపై నిరసనను విరమించారు.
అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. గతంలో ఆలంను అతని అత్తమామలు కొట్టారని.. దీంతో హత్యలు చేసి పోలీసుల ముందు లొంగిపోతానని ఆలం వారిని బెదిరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆలం తల్లితో పాటు మరో బంధువును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆలం ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.