West Bengal: శ్రీలంక లాగా భార‌త్ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధినేత సుకంత మజుందర్ మండిపడింది. మమతా బెనర్జీ.. ముందు త‌న రాష్ట్రంపై దృష్టి సారించాల‌ని, రాష్ట్రంలోని పరిస్థితులను దీదీ ఆలోచించ‌డం లేద‌ని సుకంత మజుందర్ విమ‌ర్శించారు.  

West Bengal: శ్రీలంక కన్నా భారత ఆర్థిక పరిస్థితి మ‌రీ అధ్వాన్నంగా ఉందని, శ్రీలంక లాగా భార‌త్ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. మ‌మ‌తా బెనర్జీ ముందు త‌న రాష్ట్ర ప‌రిస్థితిపై దృష్టి సారించాల‌ని, రాష్ట్రంలోని పరిస్థితులపై ఆలోచించాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధినేత సుకంత మజుందర్.

మంగళవారం కో‌ల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీజేపీ చీఫ్‌ సుకంత మజుందర్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకతో భారతదేశ ఆర్థిక పరిస్థితిని పోల్చడాన్ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఒకవేళ బెంగాల్ ప్రత్యేక దేశంగా ఉండుంటే శ్రీలంక కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కునేదని ఆయన అన్నారు.

ముందు మమతా బెనర్జీ త‌న రాష్ట్రం బెంగాల్‌ను సరిగా చూసుకోవాలనీ, శ్రీలంక పూర్తిగా ధ్వంసమైందని, అది చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని వివ‌రించారు. అయితే బెంగాల్ కూడా అలా కావొద్దంటే మమతా రాష్ట్రంపై శ్రద్ధ వహించాల‌ని హిత‌వు ప‌లికారు. నిజానికి శ్రీలంక రుణం రూ. 6 లక్షల కోట్లని, పశ్చిమ బెంగాల్ రూ. 5.32 లక్షల కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రత్యేక దేశంగా ఉండి ఉంటే.. అది శ్రీలంక కంటే చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉండేదని చమత్కరించాడు. సీఎం మమత తన సొంత రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చుర‌క‌లంటించారు.

ఇంత‌కీ దీదీ ఏమ‌న్నారంటే..? 

శ్రీలంక ఆర్థిక ప‌రిస్థితి కన్నా భారత ఆర్థిక పరిస్థితి మ‌రింత‌ అధ్వాన్నంగా ఉందని మమతా బెనర్జీ విమర్శించారు. దాన్ని పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్ర‌స్తుతం భారత ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందనీ. శ్రీలంకలో ప్రజలు నిరసనగా వీధుల్లోకి వచ్చారు. శ్రీలంకతో పోల్చినప్పుడు భారత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది’ అని అన్నారు.

 దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల గురించి ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో ఆర్థిక సంక్షోభంపై చర్చించడానికి కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను పిలవాలని కూడా సూచించారు. ఈ క్ర‌మంలో కేంద్రంపై మమతా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా నియంత్రించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దానికి బదులుగా సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో కేంద్రం ఆలోచించాలని, అందుకోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ సీఎం వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు డాక్టర్ అజయ్ అలోక్.. సీఎం బెనర్జీని నిందించారు. దీదీ ఏమి మాట్లాడుతున్నారో.. ఆమె పార్టీకి తెలియదని పేర్కొన్నారు. ప్రజలు ఖచ్చితంగా మన దేశం శ్రీలంక మార్గంలో వెళ్లాలని కోరుకుంటున్నారు. వారికి ఆర్థిక శాస్త్రం అర్థం తెలియదనీ,సలహాలు ఇస్తున్నారని జెడియు అజయ్ అలోక్ అన్నారు.

కాగా, మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై రాష్ట్రీయ జనతాదళ్ నేత, మాజీ ఎంపీ శివానంద్ తివారీ మండిపడ్డారు. “భారత్‌ను శ్రీలంకతో పోల్చడం స‌రికాద‌ని, తాను మమతా బెనర్జీతో ఏకీభవించనని, శ్రీలంక లాంటి పరిస్థితి భారత్‌లో ఇంకా జరగలేదని ఆర్జేడీ నేత అన్నారు. ఇంతలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అమిత‌మైన‌ నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటోందని వివ‌రించారు.