ఫణి తుఫాన్ ఎఫెక్ట్: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకొన్న దీదీ
ఫోని తుఫాన్ను దృష్టిలో ఉంచుకొని రానున్న 48 గంటల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రద్దు చేసుకొన్నారు.ఫణి తుఫాన్ తీరం దాటింది
కోల్కత్తా: ఫోని తుఫాన్ను దృష్టిలో ఉంచుకొని రానున్న 48 గంటల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రద్దు చేసుకొన్నారు.ఫణి తుఫాన్ తీరం దాటింది. బెంగాల్ వైపుకు దూసుకుపోతోంది.
బెంగాల్ తీర ప్రాంత జిల్లా మిడ్నపూర్లో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలని బెంగాల్ సీఎం మమత బెనర్జీ అధికారులను ఆదేశించారు. తుఫాన్ కారణంగా వచ్చే 48 గంటల్లో తన ర్యాలీలను రద్దు చేసుకొన్నారు. తుఫాన్ పరిస్థితిని పరిశీలిస్తూ తగిన చర్యలు చేపట్టారు.
రెండు రోజుల పాటు ప్రభుత్వం అందించే సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని దీదీ ప్రజలను కోరారు. పశ్చిమ మిడ్నపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టూరిస్టులు సముద్రం ముందున్న వసతి గృహాల్లో బస చేయవద్దని, మత్స్యకారులు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని కోరింది.
పాఠశాలలు, విద్యాసంస్ధలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక కోల్కతాతో పాటు పశ్చిమ మిడ్నపూర్, ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ, హౌరా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది.