ముంబైలో 20 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం..7కు చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలోని ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం (major fire broke out) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. మరోవైపు క్షతగాత్రలుకు ఆస్పత్రులలో చికిత్స కొనసాగుతుంది.
మహారాష్ట్రలోని ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం (major fire broke out) చోటుచేసుకుంది. ముంబైలోని తార్దేవ్ ప్రాంతంలోని (Tardeo area) గాంధీ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల కమల బిల్డింగ్లో (Kamla building) ఈ ప్రమాదం జరిగింది. బిల్డింగ్లోని 18 అంతస్తులో శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కి చేరింది. అయితే గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 13 ఫైరింజన్లు, 7 వాటర్ జెట్టీలను అక్కడికి తరలించారు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. అగ్ని ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే అగ్ని ప్రమాద తీవ్రత దృష్ట్యా దీనిని లెవల్-3 ప్రమాదంగా అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టుగా అధికారులు తెలిపారు. గాయపడినవారిలో 14 మందిని భాటియా ఆస్పత్రికి తరలించగా.. అందులో 12 మందికి జనరల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. మరో ఇద్దరిలో ఒకరు మృతిచెందడగా.. మరోకరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఏడుగురిని బీఎంసీ నాయర్ హాస్పిటల్కు తరలించారు. వారిలో ఐదుగురు మృతిచెందారు. కస్తూర్భా హాస్పిటల్కు తరలించిన ఇద్దరిలో ఒకరు మృతిచెందారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణమేమిటనేది అధికారులు వెల్లడించలేదు.
ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే.. తాను అధికారులతో నిరంతరం టచ్లో ఉన్నానని తెలిపారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.