మహీంద్రా టియూవీ300 విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లో విక్రయిస్తున్న టియూవీ300 మోడల్ ఎస్యూవీలో ఓ కొత్త వేరియంట్ను మార్కెట్లో విడుదల చేసింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లో విక్రయిస్తున్న టియూవీ300 మోడల్ ఎస్యూవీలో ఓ కొత్త వేరియంట్ను మార్కెట్లో విడుదల చేసింది. తొమ్మిది మంది కూర్చునేలా తయారు చేసిన మహీంద్రా టియూవీ300 ప్లస్ ప్రారంభ ధరను రూ.9.47 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి.
మహీంద్రా టియూవీ300 ప్లస్ పి4 - రూ.9.47 లక్షలు
మహీంద్రా టియూవీ300 ప్లస్ పి6 - రూ.9.83 లక్షలు
మహీంద్రా టియూవీ300 ప్లస్ పి8 - రూ.10.86 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)
ఈ మూడు వేరియంట్లు కూడా ఐదు ఆకర్షణీయైన రంగుల్లో లభ్యం కానుంది. అవి..
1. మెజిస్టిక్ సిల్వర్
2. బోల్డ్ బ్లాక్
3. డైనమిక్ రెడ్
4. మోల్టెన్ ఆరెంజ్
5. గ్లాసీయర్ వైట్
ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న సబ్-ఫోర్ మీటర్ (నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవున్న) టియూవీ300 మోడల్ ఆధారంగా చేసుకొని, ఈ సరికొత్త టియూవీ300 ప్లస్ కారును డిజైన్ చేశారు. ఈ కారులో 9 సీట్లు ఉంటాయి. ఈ కారులో కొత్త ఎమ్హాక్ డి120 2.2 లీటర్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్పిల శక్తిని, 280 ఎన్ఎమ్ల టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
ఈ కారులో మహీంద్రా సిగ్నేచర్ మైక్రోహైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ (బ్రేక్ వేసినప్పుడల్లా పవర్ ఉత్పత్తి కావటం) మరియు కారు ఇంజన్ ఐడిల్గా ఉన్నప్పుడు ఆఫ్ అయ్యి, గ్యాస్ పెడల్ ప్రెస్ చేయగానే ఆన్ అయ్యేలా డిజైన్ చేసిన మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా ఈ కారు అధిక మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా టియూవీ300 ప్లస్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనో లాజీ, మారుతి సుజుకి ఎర్టిగా వంటి మోడళ్లకు పోటీగా నిలబడుతుంది.