maharashtra crisis : ఏక్నాథ్కు షాక్.. అధిష్టానంతో తిరిగొచ్చిన ఇద్దరు శివసేన ఎమ్మెల్యేల భేటీ
ఏక్నాథ్ షిండే క్యాంప్ నుంచి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు నితిన్ దేశ్ముఖ్, కైలాస్ పాటిల్లు గురువారం పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్వహించిన సమావేశంలోనూ వారు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాలు (maharashtra crisis) వేగంగా మారిపోతున్నాయి. ఏక్నాథ్ షిండే (eknath shinde) క్యాంప్ నుంచి ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అకోలా ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్, కైలాస్ పాటిల్ నిన్న ముంబైకి చేరుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శివసేన పార్టీ అగ్రనేతలను కలిశారు. ఏక్నాథ్ షిండే క్యాంపులో వున్న 37 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది తమకు టచ్లోకి వచ్చినట్లు ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వారంతా ముంబైకి తిరిగి వస్తున్నట్లు తనతో చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు. అవిశ్వాస తీర్మానం జరిగితే ఖచ్చితంగా గెలుస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండ్కు మద్దతుగా నిలిచినట్టుగా భావించిన ఆ పార్టీ ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ బుధవారం తిరిగి మహారాష్ట్రకు చేరుకున్నారు. తాను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు (uddhav thackeray) మద్దతుగా ఉన్నానని చెప్పారు. తనను కిడ్నాప్ చేసి సూరత్కు తీసుకెళ్లారని.. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చినట్టుగా తెలిపారు. ‘‘నేను తప్పించుకుని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డుపై నిలబడి.. రోడ్డుపై వెళ్తున్న వాహనాల్లో అక్కడి నుంచి బయటపడాలని భావించాను. అయితే ఆ సమయంలో వంద మందికి పైగా పోలీసులు వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు నాకు గుండెపోటు వచ్చినట్లు నటించారు. నా శరీరంపై కొన్ని వైద్య ప్రక్రియలను నిర్వహించడానికి ప్రయత్నించారు. నాకు అప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు ”అని నితిన్ దేశ్ముఖ్ మీడియాకు తెలిపారు.
మీడియా అడిగిన ఓ ప్రశ్నపై స్పందించిన నితిన్ దేశ్ముఖ్.. ‘‘నేను కచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నాను’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. నితిన్ దేశ్ముఖ్ మహారాష్ట్రలోని బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే నితిన్ దేశ్ముఖ్.. శివసేన రెబల్ క్యాంపులో చేరిపోయాడనే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. నితిన్ దేశ్ముఖ్కు ప్రాణహాని ఉందనే అనుమానంతో ఆయన భార్య Pranjali మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. జూన్ 20 రాత్రి 7 గంటలకు తన భర్తతో ఫోన్ కాల్లో చివరిసారిగా మాట్లాడానని.. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతనితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నానని అకోలా పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ప్రాంజలి ఫిర్యాదు చేశారు.తన భర్తకు ప్రాణహాని ఉందని అనుమానిస్తున్నట్లు ఆమె తెలిపారు.