Maharashtra Political Crisis: 'మహా' రాజకీయ సంక్షోభం..! పతనం తప్పదా?
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఏక్నాథ్ షిండే సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన చేశారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే, దాదాపు 34 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు ప్రకటించడంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలంతా.. రాష్ట్రం వీడి.. ప్రస్తుతం బిజెపి పాలిత రాష్ట్రమైన గుజరాత్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా బిజెపిలో చేరారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరంతా పార్టీ మారినా.. లేదా రాజీనామా చేసిననా.. మహారాష్ట్ర అసెంబ్లీలో థాకరే ప్రభుత్వ బలం తగ్గి మెజార్టీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పతనానికి సిద్ధంగా ఉందా? అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది.
మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. ఇటీవల ఓ శివసేన ఎమ్మెల్యే మరణించడంతో ఆ సంఖ్య 287 కి చేరింది. ఈ క్రమంలో ఏ పార్టీ అయినా అధికారాన్ని నిలుపెట్టుకోవాలంటే.. మెజార్టీ మార్క్ 144 దాటాల్సిందే.. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమికి 152 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇందులో 55 మంది శివసేన ఎమ్మెల్యేలు గా..53 మంది ఎన్సిపికి, 44 మంది కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలు. వీరితో పాటు కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు తమకు ఉందని కూటమి పేర్కొంది.
కానీ, ప్రస్తుతం శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది తిరుగుబాటు ప్రకటించారు. ఏక్నాథ్ షిండే సహా వీరంతా రాజీనామా చేస్తే శివసేన సంఖ్యా బలం తగ్గుతుంది. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వ బలం పడిపోతుంది. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు మెజార్టీ మార్క్ కూడా తగ్గుతుంది ఉంటుంది.
ప్రస్తుతం అసెంబ్లీలో బిజెపికి 106 మంది సభ్యుల బలం ఉంది. అదే సమయంలో స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బిజెపి అధికారం లోకి రావచ్చు. ఇదిలా ఉంటే.. సోమవారం జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో బిజెపి 134 ఓట్లను గెలుచుకుంది. పలువురు శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినట్లు సమాచారం.
ఇందులో రహస్యమేమీ లేదని, థాకరే ప్రభుత్వం పట్ల పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బిజెపి నేత సుధీర్ ముంగటివార్ తెలిపారు. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి 134 ఓట్లు గెలుచుకుందని, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 11 ఓట్లు మాత్రమే తగ్గాయని అన్నారు. ఇది అంత సులభం కాదని.. కానీ వాస్తవానికి జరుగుతుందని అన్నారు.
ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మధ్యలో ఏక్నాథ్ షిండే సీఎం ఉద్ధవ్ థాకరేతో ఫోన్లో మాట్లాడారు. దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సూరత్ హోటల్లో ఏకనాథ్ షిండే, రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన శివసేన నేత మిలింద్ నర్వేకర్ ఫోన్లో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముందు పలు డిమాండ్లు ఉంచారు. శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఏక్నాథ్ షిండే కోరారు.
తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాంటప్పుడు తనని గ్రూప్ లీడర్ పదవి నుంచి ఎందుకు తొలగించారని షిండే అన్నారు. తనకు శివసేన పార్టీని వీడే ఆలోచన లేదనీ, తాను బాలాసాహెబ్ ఠాక్రే యొక్క నిజమైన శివసైనికుని అని తెలిపారు. శివసేన నేత సంజయ్ రౌత్పై కూడా ఏక్నాథ్ షిండే ఫిర్యాదు చేశారు.
తిరిగి రావాలని కోరిన సీఎం
సిఎం ఉద్ధవ్ ఠాక్రే.. షిండేను తిరిగి వచ్చి తన నిర్ణయాన్ని పునరాలోచించవలసిందిగా కోరారు. అంతకుముందు హోటల్లో ఏక్నాథ్ షిండే, మిలింద్ నర్వేకర్ మధ్య దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఎంవీఏ నుంచి తప్పుకోవాలని, అప్పుడే తిరిగి రావడం సాధ్యమని షిండే సమావేశంలో షరతు పెట్టారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. బంతి ఇప్పుడు ఏకనాథ్ షిండే కోర్టులో ఉంది. అతను చివరి వరకు బ్యాటింగ్ చేసి, ఈ సమయంలో.. శివసేన యొక్క తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ అతనితో అతుక్కుపోతే.. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఏక్నాథ్ షిండేతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే, శివసేన తమ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని తిరిగి పొందగలిగితే, అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో దీర్ఘకాల మిత్రపక్షమైన బిజెపిని వీడి శివసేన ఎన్సిపి, కాంగ్రెస్లతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.