భూమిలో పూడ్చిపెట్టుకుని రైతు వినూత్న నిరసన.. ‘ఆ పథకం కింద నాకు రావాల్సిన భూమి ఇవ్వాల్సిందే’ (వీడియో)
మహారాష్ట్రలోని రైతు వినూత్న రీతిలో నిరసన చేస్తున్నాడు. తనను తాను భుజం మేరకు భూమిలో పాతుకుని నిరసనకు దిగాడు. మూడేళ్ల క్రితం ఓ సంక్షేమ పథకంలో తనకు కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన దస్తావేజులను ఇంకా ఇవ్వలేదని, వాటిని తనకు ఇచ్చే వరకు నిరసన చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ముంబయి: మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మూడేళ్ల క్రితం ఓ సంక్షేమ పథకం కింద తనకు కేటాయించిన భూమిని వెంటనే అప్పగించాలని ఆయన నిరసన బాట పట్టారు. ఆయన భూమిలో భుజం వరకు గుంత తవ్వుకుని తనను తాను పాతిపెట్టుకుని నిరసన చేశారు. తన భూమిని అందించే వరకు నిరసన ఆపబోనని ఆయన స్పష్టం చేశారు.
జాల్నా జిల్లాకు చెందిన సునీల్ జాదవ్ రైతు ఈ నిరసన చేస్తున్నారు. కర్మవీర్ దాదాసాహెబ్ గైక్వాడ్ సబ్లికరణ్ స్వాభిమాన్ స్కీం కింద 2019లో తనకు భూమి కేటాయించారని, కానీ, ఆ భూమి పేపర్లు ఇంకా తన చేతికి అందలేవని ఆయన తెలిపారు.
‘2019లో తమకు రెండు ఎకరాల భూమిని దాదాసాహెబ్ గైక్వాడ్ స్కీం కింద కేటాయించారు. కానీ, నాకు ఇప్పటి వరకు ఆ భూమికి సంబంధించిన దస్తావేజులను అందించలేదు. కాబట్టి, ఇక్కడ నన్ను నేను పాతిపెట్టుకున్నా’ అని రైతు తెలిపారు. అంతేకాదు, తనకు ఆ భూమి కాగితాలు ఇచ్చే వరకూ నిరసన చేస్తూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
అధికారులు, ప్రజల ముందు తమ డిమాండ్లు పెట్టడానికి నిరసనకారులు వినూత్న మార్గాలను ఎంచుకుంటారు. గతం లోనూ రైతులు వినూత్నంగా నిరసనలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా, మహారాష్ట్ర రైతు చేస్తున్న నిరసనలను పలువురు అక్కడికి వెళ్లి వీడియో రికార్డు చేసుకుంటున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో ఈ వీడియో ను వైరల్ చేసే పని లో ఉన్నారు.