ఛత్రపతి శివాజీని అవమానించారు.. కాషాయ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి: మహారాష్ట్ర బీజేపీపై కాంగ్రెస్ ఫైర్
Mumbai: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను బీజేపీ అవమానించిందనీ, రాష్ట్ర కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గత నెలలో గవర్నర్ శివాజీ మహారాజ్ను ఒక పాత కాలపు నాయకుడుగా అభివర్ణించినప్పటి నుండి మహారాష్ట్రలో రాజకీయాలు ఉడికిపోతున్నాయి.
Maharashtra Congress: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై మరోసారి కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను బీజేపీ అవమానించిందనీ పేర్కొంటూ.. రాష్ట్ర కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే, రైతుల పట్ల కేంద్ర, రాష్ట్రంలో ఉన్న బీజేపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కూడా ఆరోపించింది.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూనే తిరుగుతున్నాయి. శివాజీ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. గత నెలలో గవర్నర్ శివాజీ మహారాజ్ను ఒక పాత కాలపు నాయకుడుగా అభివర్ణించినప్పటి నుండి మహారాష్ట్రలో రాజకీయాలు ఉడికిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, గవర్నర్, అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మరోసారి బీజేపీపై విమర్శల దాడిని కొనసాగించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ను అవమానించిందని ఆరోపిస్తూ, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే గురువారం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. పంటనష్టం జరిగి రైతులను ఆదుకోవడం సర్కారు తీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించినప్పటికీ పరిహారం అందడం లేదని అన్నారు.
రైతులకు తాము అండగా ఉంటామనీ, నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకువస్తామని తెలిపారు. అలాగే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, బీజేపీ నేతలు ఛత్రపతి శివాజీ మహారాజ్ పై చేసిన వ్యాఖ్యలు ఖండించిన ఆయన.. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ జీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది శివాజీ మహారాజ్పై వ్యాఖ్యలు చేశారు. నిన్న (బీజేపీ మంత్రి మంగళ్ ప్రభాత్) లోధా ఇందులో ఒక అడుగు ముందుకేసి మరిన్ని వ్యాఖ్యలు చేశారు. నా విజ్ఞప్తి ఏమిటంటే, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు శివాజీ మహారాజ్ ను నుంచి స్ఫూర్తి పొందాలి. ఛత్రపతి శివాజీ ఆదర్శాల ప్రకారం, శివాజీ మహారాజ్పై వారికి గౌరవం ఉంటే.. మరాఠా యోధున్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే రాజీనామా చేయాలి" అని పటోలే అన్నారు. ఒకవైపు శివాజీ మహారాజ్ను పొగిడి మరో వైపు దూషిస్తూ.. ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని బీజేపీపై మండిపడ్డారు.
కాగా, గత నెలలో గవర్నర్ శివాజీ మహారాజ్ను పాతకాలపు నాయకుడు (చిహ్నం) అభివర్ణించారు. అప్పటి నుండి మహారాష్ట్రలో రాజకీయాలు ఉడికిపోతున్నాయి. శివాజీ మహారాజ్ పై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం సైతం ఘాటుగానే స్పందించింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనతో కూడిన మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి.. గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలని పేర్కొంది. గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.