మహారాష్ట్రలో కాంగ్రెస్కు షాక్.. సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన బాలాసాహెబ్ థోరట్..!
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న బాలాసాహెబ్ థోరట్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న బాలాసాహెబ్ థోరట్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బాలాసాహెబ్ థోరట్ లేఖ రాశారు. తనపై పార్టీ రాష్ట్ర మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే కుట్ర పన్నారని ఆరోపిస్తూ.. ఆయనతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు థోరట్ లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చిన ఒకరోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఖర్గేకు థోరట్ లేఖ రాసిన విషయాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆ లేఖలో.. తాను అవమానించబడినట్టుగా పేర్కొన్నారు. తాను బీజేపీతో జతకడుతున్నట్లు చిత్రీకరిస్తూ తనపై దుష్ప్రచారం జరిగిందని చెప్పారు.. మహారాష్ట్రలో నిర్ణయాలు తీసుకునే ముందు తనను సంప్రదించలేదని థోరట్ పేర్కొన్నారు. ఇక, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు బయటపడ్డాయి.