పళనిస్వామి ప్రభుత్వానికి పరీక్ష: 18 మంది ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు తీర్పు నేడే
అన్నాడిఎంకె సర్కార్ కు విషమ పరీక్ష
చెన్నై: తమిళనాడులో పళనస్వామి ప్రభుత్వానికి దినకరన్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై దాఖలైన కేసుపై గురువారం నాడు మద్రాస్ హైకోర్టు గురువారం నాడు కీలకమైన తీర్పును వెలువర్చే అవకాశం ఉంది.
2017 సెప్టెంబర్లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేశారు. అన్నాడీఎంకే విప్కు వ్యతిరేకంగా దినకనర్కు మద్దతు తెలుపడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు.
ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పు ఎలా ఉటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దును మద్రాస్ హైకోర్టు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే ఈ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడిఎంకె గట్టెక్కడం అంతా ఆషామాషీ వ్యవహరం కాదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
234 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 117. అన్నాడిఎంకె కు 114 మంది మాత్రమే బలం ఉంది. మరో 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వైపు ఉణ్నారు. వీరిపై హైకోర్టు వేటేస్తే ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు దినకరన్ చక్రం తిప్పే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.