మధ్యప్రదేశ్లో ముగ్గురు రైతుల కిడ్నాప్.. ముఠా డిమాండ్ చేసిన డబ్బుల కోసం చందా వేసుకుంటున్న గ్రామస్తులు
మధ్యప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులను రాజస్తాన్కు చెందిన కొందరు దోపిడీదారులు కిడ్నాప్ చేశారు. రూ. 15 లక్షలు ఇస్తేనే వారిని విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. ఆ పేద కుటుంబాలు రూ. 15 లక్షల కోసం తంటాలు పడుతున్నాయి. ఇది చూసి ఆ ఊరి ప్రజలంతా చందాలు వేసుకుంటున్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల గ్రామం నుంచి ముగ్గురు వ్యక్తులను పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు నేరస్తులు కిడ్నాప్ చేశారు. ఆ గ్యాంగ్ రాజస్తాన్ నుంచి నడుస్తుంది. ఆ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను విడుదల చేయాలంటే లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. వారంతా పేదలు. వారిని విడుదల చేయడానికి ఊరు ప్రజలంతా సంకల్పించారు. గ్రామస్తులంతా రూ. 100, రూ. 200 మొదలు రూ. 2000 వరకు చందాలు వేసుకుంటున్నట్టు ఓ గ్రామస్తుడు రాంజీ బగేల్ వివరించారు.
శియోపూర్ జిల్లాకుు చెందిన రామ్ స్వరూప్ యాదవ్, భట్టు బగేల్, గుడ్డ బగేల్లు నాలుగు రోజులుగా కనిపించడం లేదు. వారిని తామే కిడ్నాప్ చేశామని, వారిని విడుదల చేయాలంటే రూ. 15 లక్షలు అందించాలని ఆ గ్యాంగ్ డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై మాజీ సర్పంచ్ సియారామ్ బగేల్ మాట్లాడుతూ, ‘మా గ్రామంలో ఎక్కువగా పేద కుటుంబాలే ఉన్నాయి. అందులో చాలా మంది పశువులను పెంచుకుంటూ జీవిస్తుంటారు. కిడ్నాప్ అయిన ఒకరి కుటుంబం కటిక దారిద్ర్యంలో ఉన్నది. కనీసం ఇంటి పై కప్పు కూడా సరిగా లేదు. అలాంటప్పుడు ఈ కుటుంబాలు ఎలా రూ. 5 లక్షలు కూడబెడతాయి. కాబట్టి, మేమంతా డబ్బులు చందాలు వేసుకుని కూడబెట్టి వారిని విడుదల చేసుకోవడానికి ప్రయత్నిస్తాం’ అని వివరించారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్, రాష్ట్ర మాజీ మంత్రి రామనివాస్ రావత్ ఈ గ్రామానికి వెళ్లారు. అపహరణకు గురైన ముగ్గురు రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ దోపిడీ ముఠాల నుంచి తప్పించుకోవడానికి పలువురు రైతులు కూడా తమ పశువులను అమ్మేసుకుంటున్నారని వివరించారు.
కిడ్నాపర్ల గురించి వివరాలు తెలియజేస్తే వారికి రూ. 10,000 రివార్డును ఏడీజీ చంబల్ రేంజ్ ఆఫీసు ప్రకటించిందని, ఆ తర్వాత దాన్ని రూ.30,000కు పెంచిందని శియోపూర్ ఎస్పీ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు.
రాజస్తాన్కు చెందిన దోపిడీ ముఠాలు మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన గ్వాలియర్, చంబల్ రీజియన్లో యాక్టివ్గా ఉంటాయని, ముఖ్యంగా శియోపూర్ జిల్లాలో వీరి దోపిడీలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తున్నది.