క్యాంపస్లోనే పకోడీలు: హస్టల్ నుండి విద్యార్ధి గెంటివేత, ఫైన్
న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీలో పకోడిలు తయారు చేసిన ఎంఫిల్ విద్యార్ధికి రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు హస్టల్ నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీలో పకోడిలు తయారు చేసిన ఎంఫిల్ విద్యార్ధికి రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు హస్టల్ నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. పకోడిలు విక్రయించి దేశానికి డబ్బులు సంపాదించాలని గతంలో ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా క్యాంపస్ ఆవరణలో ఎంఫిల్ విద్యార్ధి మనీష్ కుమార్ మీనా వ్యక్తం చేశారు.
రాజస్థాన్కు చెందిన మనీష్కుమార్ మీనా జేఎన్యూలో ఎంఫిల్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యూనివర్శిటీ ఆవరణలో పకోడిలు తయారు చేశాడు. మరో ముగ్గురు మిత్రుల సహాయంతో పకోడిలు తయారు చేసి క్యాంపస్లో విక్రయించాడు.
అయితే ఈ విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం నిందితుడిపై చర్యలు తీసుకొంది. క్యాంపస్ నియమ నిబంధలకు విరుద్దంగా మనీష్ వ్యవహరించాడని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయమై విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు గాను మనీష్కుమార్ కు రూ.20 వేలు జరిమానా విధించింది. అంతేకాదు హస్టల్ నుండి కూడ వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ మనీష్ ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో నిరవసన వ్యక్తం చేస్తే విచారణ కమిషన్ మాత్రం చర్యలు తీసుకొంది. విద్యార్ధులు తమ థీసిస్ పేపర్లు సమర్పించే సమయంలో చర్యలు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని మోడీ ఆదేశాల మేరకే పకోడీలు తయారు చేసినట్టుగా మనీష్ చెబుతున్నారు. ప్రధాని మాటలను పాటిస్తే తనపై చర్యలు తీసుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. తన వద్ద డబ్బులు లేవన్నారు. ఈ నెల 21 నాటికి థీసీస్ పేపర్లను సమర్పించాల్సి ఉందన్నారు. యూనివర్శిటీ అధికారులు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మనీష్ ఆరోపించారు.