వరించిన అదృష్టం.. కొన్న గంటకే టికెట్ కు రూ. కోటి లాటరీ..
లాటరీ టికెట్ కొన్న గంటనే ఓ క్లర్కును అదృష్టం వరించింది. రూ. కోటి జాక్ పాట్ కొట్టాడు. దీంతో నమ్మశక్యం కావడం లేదంటూ సంతోషంలో మునిగి తేలుతున్నాడు.
పంజాబ్ : పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి సరదాగా లాటరీ కొన్నాడు. గంటలోనే అతను కొన్న లాటరీకి కోటి రూపాయలు బహుమతి వచ్చింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ అదృష్టవంతుడు పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలో డేరా బాబా నానక్ టౌన్ కు చెందిన రూపీందర్ జిత్ సింగ్. అతను అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తున్నాడు.
ఒక ఏడాదికాలంగా రూపీందర్ జిత్ సింగ్ లాటరీ టికెట్లు కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం కూడా అలాగే 12 గంటల సమయంలో నాగాలాండ్ లాటరీ టికెట్ కొన్నాడు. ఒక్కొక్కటి రూ. 6 చొప్పున.. 25 లాటరీ టికెట్లు కొన్నాడు. ఎప్పట్లాగా ఆ టికెట్లను తన దగ్గర పెట్టుకున్నాడు… బ్యాంకు పనిలో పడిపోయాడు. ఏడాదిగా లాటరీలు కొంటున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో దానిమీద పెద్దగా మనసు పెట్టలేదు.
మానవ మృగాలు.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. ప్రియుడితో సహా ఐదుగురు స్నేహితుల అరెస్టు
ఇంతలో ఓ గంట తర్వాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు కోటి రూపాయలు గెలుచుకున్నా’రంటూ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రూపేందర్ ఆ తర్వాత సంతోషంతో ఉబ్బితబ్బైపోయాడు. విషయం తెలియడంతో బ్యాంకు సిబ్బంది రూపీందర్ జిత్ సింగ్ ను అభినందనల్లో ముంచెత్తారు. ఇదంతా కలలాగా ఉందంటూ రూపీందర్ జిత్ సింగ్ అంటున్నాడు.
తాను గెలుచుకున్న ఈ మొత్తాన్ని తన పిల్లల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని.. అందులో కొంత మొత్తాన్ని పేదల కోసం వాడతానన్నాడు. దీంతో లాటరీలు కొనే వారిలో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగిపోయింది. ఎందుకంటే కొద్దికాలం క్రితం ఇక్కడే ఓ కిరాణా దుకాణ యజమానికి లాటరీలో రూ.2.5 కోట్ల లాటరీ దక్కింది.