ఆరు రోజుల ముందే వాయిదా :పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా
లోక్ సభ శుక్రవారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే లోక్ సభ లోక్ సభ వాయిదా పడింది
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందే లోక్ సభ వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా లోక్ సభ ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఆరు రోజుల ముందుగానే లోక్ సభను వాయిదా వేశారు.ఈ నెల 7వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ సెషన్ కుదించేందుకు లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. 62 గంటల 42 నిమిషాల పాటు లోక్ సభలో కార్యక్రమాలు జరిగినట్టుగా స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ నెల 7వ తేదీన శీతాకాల సమావేశాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ లో చైనా, ఇండియా సైనికుల మధ్య ఘర్షణపై పార్లమెంట్ లో చర్చకు విపక్షం పట్టుబట్టింది. అయితే ఈ విషయమై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు. ఈ విషయమై చర్చకు విపక్షాలు పార్లమెంట్ లో నిరసనకు దిగాయి. ఈ సెషన్ లో షెడ్యూల్డ్ తెగల (ఆర్డర్) 1950 కి సవరణలు కూడా ఆమోదించారు. కొన్ని ఇతర బిల్లులు వన్యప్రాణలు(రక్షణ)సవరణ బిల్లు 2021, ఇంధన సంరక్షణ (సవరణ బిల్లు 2022, సముద్రపు పైరసీ నిరోధక బిల్లు 2019 బిల్లులపై చర్చ జరిగింది.
రాజ్యసభ నిరవధిక వాయిదా
లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన కొద్దిసేటికే రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభను వాయిదా వేయడానికి ముందు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.