బడా వ్యాపారులకు రుణాలు మాఫీ.. చిరు వ్యాపారులు, రైతులు జైల్లోకా? : సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విభజన వ్యూహాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే, భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దో హిందూస్తాన్" అనే ఆలోచనను భారతీయులు సహించబోరని అన్నారు.
Bharat Jodo Yatra: భారత్ రెండు హిందుస్థానాలను అంగీకరించదని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర 20 రోజుకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు దేశ విభజనకు పాల్పడుతున్నదనీ, దో హిందుస్థాన్ ను సృష్టిస్తున్నదని ఆరోపించారు. సంపన్నులకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం పేదలపై భారం మోపుతున్నదని విమర్శించారు. ‘‘ఈరోజు బడా పారిశ్రామికవేత్తల నుంచి వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు.. కానీ, రైతు, చిన్న వ్యాపారి చిన్న రుణం కూడా తీర్చలేకపోతే ‘డిఫాల్టర్’ అంటూ జైల్లో పెడుతున్నారు. ప్రతి అన్యాయానికి భారత్ జోడో యాత్ర వ్యతిరేకం. ఈ 'దోటూ హిందుస్థాన్' వెర్షన్ను దేశం అంగీకరించదు" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
అంతకుముందు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోొందని ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
20 రోజుకు భారత్ జోడో యాత్ర
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడంతో పాటు గత వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర మంగళవారం నాటికి 20 రోజుకు చేరుకుంది. మంగళవారం కేరళలోని మలప్పురం జిల్లాలోకి ప్రవేశించిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రాహుల్ గాంధీ వెంట నడిచారు. పాలక్కాడ్ జిల్లాలోని కొప్పంలో సోమవారం ముగిసిన తర్వాత ఉదయం పులమంథోల్ జంక్షన్ నుండి యాత్ర ప్రారంభమైంది. రాహుల్ గాంధీ వెంట కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, ఎంపీ కే మురళీధరన్, ఎంపీ రాజ్మోహన్ ఉన్నితన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఉన్నారు. 14 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం రాహుల్ గాంధీ మధ్యాహ్నం పొరుగు ప్రాంతాల రైతులతో ముచ్చటించనున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ 3,570 కి.మీ 150 రోజుల సుదీర్ఘ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమై జమ్మూ కాశ్మీర్లో ముగుస్తుంది.