కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ్ ఆలయాల వద్ద హైఅలర్ట్
ఉత్తర ప్రదేశ్ లోని పలు రైల్వే స్టేషన్ల వద్ద కూడా...
ఉత్తర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పలు దేవాలయాలు, రైల్వేస్టేషన్ల ల వద్ద దాడులకు పాల్పడతామంటూ ఉగ్రవాదుల నుండి లేఖలు వచ్చిన నేపథ్యం ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించినట్లు ఓ అధికారి తెలిపారు.
లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థ నుండి బెదిరింపు లేఖలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ్ ఆలయాలతో సహా రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లపై దాడులు జరుపనున్నట్లు లష్కర్ ఈ తోయిబా కమాండర్ పేరుతో లేఖలు బైటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
ఇంతకు ముందు కూడా ఇలా లష్కర్ ఈ తోయిబా ఏరియా కమాండర్ మౌలానా అబూ షేఖ్ పేరుతో బెదిరింపు లేఖలు వచ్చాయి. అపుడు నార్తర్న్ రైల్వే పరిధిలోని సహకరన్పూర్, హపూర్ రైల్వే స్టేషన్ సహా ఇతర స్టేషన్లలో పేలుళ్లు జరపనున్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇలా మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.