మణిపూర్ లో ఆర్మీ క్యాంపుపై విరిగిపడ్డ కొండచరియలు..
మణిపూర్ లో రైల్వే లైన్ నిర్మాణం కోసం మోహరించిన ఆర్మీ క్యాంపుపై కొండచరియలు విరగిపడ్డాయి. దీంతో పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి.
మణిపూర్ లో ఓ ఆర్మీ క్యాంపుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయి. వారందరినీ హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రిబామ్ నుండి ఇంఫాల్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం మణిపూర్లోని నోనీ జిల్లాలోని టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కంపెనీ మోహరించారు. అయితే ఈ క్యాంపుపై బుధవారం రాత్రి ఒక్క సారిగా భారీ కొండచరియలు పడ్డాయి.
‘‘ ఇప్పటి వరకు మొత్తం 13 మందిని రక్షించాం. గాయపడిన వారంతా నోనీ ఆర్మీ మెడికల్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని మెరుగైన చికిత్స కోసం తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.’’ అని అధికారులు వార్తా సంస్థ ANI కి తెలిపారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో ఇజై నది ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. కాగా ఘటనా స్థలానికి ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బంది చేరుకొని పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. సైట్లో అందుబాటులో ఉన్న ఇంజనీర్ ప్లాంట్ పరికరాలను సహాయక చర్యలలో ఉపయోగిస్తున్నారు.
Monsoon: దేశరాజధాని ఢిల్లీని తాకిన వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ !
అయితే కొండచరియలు విరిగిపడటం, చెడు వాతావరణం కారణంగా రెస్క్యూ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ గల్లంతైన వ్యక్తులను రక్షించడానికి సిబ్బంది సమిష్టిగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాతావరణం క్లియర్ అయ్యే వరకు ఆర్మీ హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. కాగా కొండచరియలు విరిగిపడిన పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ట్విట్టర్లో తెలిపారు. ‘‘ ఇప్పటికే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. వాటిని ఈరోజు మన ప్రార్థనల్లో ఉంచుకుందాం. ఆపరేషన్లో సహాయం చేయడానికి వైద్యులతో పాటు అంబులెన్స్లు కూడా పంపించాం. ’’ అని ఆయన ట్వీట్ చేశారు.