సారాంశం

పంజాబ్‌లో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. పాతకక్షలతో కొందరూ దుండగులు ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసి..దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా.. మేమే చంపామంటూ హెచ్చరించారు. 

పంజాబ్‌లో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. పాతకక్షల కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కొందరూ దుండగులు ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసి.. దారుణంగా హత్య చేశారు. అనంతరం  ఆ యువకుడ్ని తన ముందు పడేసి.. మేమే చంపామంటూ.. చెప్పి మరి వెళ్లిపోయారు. అత్యంత భయానక ఘటన కపుర్తలాలోని ధిల్వాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఆరుగురు నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని కపుర్తలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) రాజ్‌పాల్ సింగ్ సంధు తెలిపారు. పోలీసు బృందాలు దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా బుధవారం రాత్రి హర్దీప్ సింగ్‌ను కత్తులు, ఇతర ఆయుధాలతో హత్య చేశారని తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. పోలీసులు ధిల్వాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

'మీ కొడుకును చంపేశాం'  

బయటకు వెళ్లిన హర్దీప్ సింగ్‌ కోసం అతడి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రాత్రి వేళ (బుధవారం రాత్రి) ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి తలుపు తట్టి మీ కొడుకును చంపేశాం అని కేకలు వేసినట్లు , ఇదిగో నీ సింహం.. ఇప్పుడు తీసుకెళ్లు అని హేళన చేశారని హర్దీప్ తండ్రి గుర్నామ్ సింగ్ ఫిర్యాదులో తెలిపారు. డోర్ తెరిచి చూడగా కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని ఫిర్యాదుదారు తెలిపారు. అతడిని జలంధర్ సివిల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పిచారు. ఇది ఏకాంత సంఘటన కాదని, పంజాబ్‌లో 'కంప్లీట్ జంగిల్ రాజ్' నడుస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. కపుర్తలాలోని ధిల్వాన్‌లో యువ కబడ్డీ  ఆటగాడు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసి షాక్ అయ్యాను. హంతకులు ఎలాంటి భయం లేకుండా.. తలుపు తట్టి .. మేము మీ కొడుకును చంపాము అని తల్లిదండ్రులకే  చెప్పారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో  అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పూర్తిగా 'జంగిల్ రాజ్' నడుస్తోంది.అని ట్వీట్ చేశారు.
 
'భగవంత్‌ మాన్‌ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి'

SAD నాయకుడు మాట్లాడుతూ.. 'పంజాబ్‌లో హత్య, దోపిడీ, స్నాచింగ్ ,  దోపిడీ రోజువారీ విషయంగా మారుతున్నాయి. భగవంత్ మాన్ పరిస్థితిని తట్టుకోలేక పోతున్నాడన్నది వాస్తవం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పదవి నుంచి దిగిపోవాలి. అని డిమాండ్ చేశారు.