Kharif Crops MSP Hike: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఎంఎస్పీ పెంపుతో పాటు రైతు రుణాలపై వడ్డీ రాయితీని కూడా ప్రకటించింది.
Kharif Crops MSP Hike: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) ప్రకటించింది. దీనిలో భాగంగా పలు ప్రధాన పంటలకు మద్దతు ధర పెంచినట్టు అధికారికంగా ప్రకటించారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఏడాది మద్దతు ధరల్లో కొన్ని పంటలకు గణనీయంగా పెరుగుదల ఉంది. ఖరీఫ్ పంటల MSPని ఖర్చు కంటే 50% ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు రైతులకు రుణాలపై వడ్డీ రాయితీ కూడా ఇవ్వనున్నారు.
పంటలు- కనీస మద్దతు ధరలు (MSP-(క్వింటాల్కు)
వరి (సాధారణ)- రూ.2369
వరి (గ్రేడ్ A)- రూ. 2389
జొన్న (హైబ్రిడ్)- రూ.3699
జొన్న (లోకల్)- రూ.3749
సజ్జ- రూ.2775
రాగులు- రూ.4886
మొక్కజొన్న- రూ.2400
కంది- రూ.8000
పెసర- రూ.8768
మినుములు- రూ.7800
నువ్వులు (మధ్యస్థం)- రూ.7710
నువ్వులు (పొడవు)- రూ.8110
పల్లీలు- రూ.7263
సన్ ఫ్లవర్- రూ.7721
సోయాబీన్- రూ.5328
నువ్వులు- రూ. 9846
నైజర్ సీడ్స్- రూ.9537
రుణాల వడ్డీపై రైతులకు రూ.15,642 కోట్ల రాయితీ
రైతు రుణాల వడ్డీపై రూ.15,642 కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లుగా, ఈ రాయితీ కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా ఇచ్చే రుణాలపై వర్తిస్తుంది. కేసీసీ ద్వారా రైతులకు రూ.2 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీనిపై వడ్డీ సంవత్సరానికి 7 శాతం ఉంటుంది. ప్రభుత్వం 1.5% వడ్డీ రాయితీ ఇస్తుంది. సకాలంలో రుణం తీర్చిన రైతులకు సంవత్సరానికి 3% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలో 7.75 కోట్లకు పైగా KCC ఖాతాలు
దేశంలో 7.75 కోట్లకు పైగా KCC ఖాతాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. వ్యవసాయానికి సంస్థాగత రుణ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఈ మద్దతు కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది ఉత్పాదకతను పెంచడానికి, చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి కీలకం. 2014లో KCC ద్వారా రూ.4.26 లక్షల కోట్ల రుణం ఇవ్వగా, డిసెంబర్ 2024 నాటికి అది రూ.10.05 లక్షల కోట్లకు పెరిగింది.