రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 సాంగ్స్.. కాపీరైట్ కేసు వేసిన మ్యూజిక్ సంస్థ
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ చాప్టర్ 2కు చెందిన పాపులర్ పాటలు వినియోగించారని కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదైంది. రాహుల్ గాంధీతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు ఫైల్ అయింది.
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో కేజీఎప్ 2 సినిమా పాటలు వినియోగించారని కేసు నమోదైంది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియాలపై ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్ కాపీరైట్ యాక్ట్ కింద కేసు పెట్టారు.
యశ్వంత్పుర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో కేజీఎఫ్ 2 బాలీవుడ్ మూవీ సాంగ్స్ వినియోగించారని నవీన్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియల పై ఫిర్యాదు చేశారు.
జైరాం రమేశ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో భారత్ జోడో యాత్ర గురించిన రెండు వీడియోలో పోస్టు చేశారని ఆ ఫిర్యాదులో నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఈ వీడియోల్లో తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కేజీఎఫ్ 2 చిత్ర పాపులర్ సాంగ్స్ను వినియోగించారని తెలిపారు.
నవీన్ కుమార్కు చెందిన సంస్థలో ఈ పాపులర్ పాటల రికార్డింగ్ జరిగిందని, ఈ పాటలపై పూర్తి హక్కులు ఆ కంపెనీకి ఉన్నాయని ఫిర్యాదు పేర్కొంది. ఈ పాటలు కేజీఎఫ్ చాప్టర్ 2 హిందీ వెర్షన్కు సంబంధించిన పాటలు అని తెలిపింది.
Also Read: మొన్న గీతారెడ్డి.. నేడు కానిస్టేబుల్, రాహుల్ పాదయాత్రలో వరుస అపశృతులు
ఈ వీడియోల ద్వారా ఒక విషయం స్పష్టం అవుతున్నదని, తమ కంపెనీకి చెందిన మ్యూజిక్ను కావాలనే కుట్రపూరితంగా దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో నవీన్ కుమార్ తెలిపారు.
భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్ 7వ తేదీన మొదలైంది. ఈ యాత్ర జమ్ము కశ్మీర్లో వచ్చే ఏడాది జనవరి 30వ తేదీన ముగిసిపోనుంది.
ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దక్షిణ రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టారు.