రఘురామ లేఖపై స్పందన: మద్ధతు పలికిన కేరళ ఎంపీ, పార్లమెంట్లో ప్రస్తావిస్తానని హామీ
ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేయడం, అనంతరం వారు తనతో వ్యవహరించిన తీరుపై వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల రూపంలో ఎంపీలు సహా పలువురు ప్రముఖులకు ఫిర్యాదు చేశారు
ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేయడం, అనంతరం వారు తనతో వ్యవహరించిన తీరుపై వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల రూపంలో ఎంపీలు సహా పలువురు ప్రముఖులకు ఫిర్యాదు చేశారు. అలాగే రాబోయే రోజుల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా, రఘురామరాజు లేఖ పట్ల కేరళ ఎంపీ ప్రేమచంద్రన్ స్పందించారు.
రఘురామపై సీఐడీ తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. ఓ ప్రజాప్రతినిధిపై దాడి చేయడం అనాగరికమని ప్రేమ చంద్రన్ అభివర్ణించారు. ఇది క్రూరమైన, అమానవీయ చర్య అని, ఇది పార్లమెంటుకు జరిగిన అవమానమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటులో తప్పక లేవనెత్తుతానని .. ఇదే సమయంలో రఘురామకృష్ణంరాజుకు మద్దతు ప్రకటిస్తున్నానని ప్రేమచంద్రన్ తెలిపారు.
అంతకుముందు సహచర ఎంపీలకు రఘురామకృష్ణంరాజు లేఖ రాసిన సంగతి తెలిసిందే.. ఇందులో తన అరెస్ట్ అనంతర పరిణామాలను ఆయన వివరించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని రఘురామ కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన ఆరోపించారు. అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు పలువురు ఎంపీలు.
Also Read:ఏపీ సీఐడి అదనపు డిజీకి షాక్: లీగల్ నోటీసు పంపిన రఘురామ కృష్ణంరాజు లాయర్
జగన్ ప్రభుత్వానిది హిట్లర్ పాలనగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ . అంతేకాకుండా రఘురామ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు ఠాగూర్. రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అభిప్రాయప్డారు పలువురు ఎంపీలు. అయితే ఎంపీలకు రాసిన లేఖలపై స్పందించడానికి రఘురామ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ బెయిల్ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానని ఆయన గుర్తుచేశారు.
ఆ కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి స్పీకర్ను కలిసిన రఘురామ దాదాపు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ స్పీకర్కు వినతిపత్రం ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. తన కేసులో సీఎం జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్కుమార్, ఏడిషినల్ ఎస్పీ విజయ్పాల్పై చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.