ఓ వ్యక్తి పరాయి మహిళను బైక్ పై ఎక్కించుకుని వెళ్లుతుండగా హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ కెమెరాలు ఫొటో తీశాయి. ఆ ఫొటోను బైక్ యజమానైనా ఆ వ్యక్తి భార్య మొబైల్కు పంపి ఫైన్ వివరాలు పేర్కొంది. ఆ ఫొటో చూసిన భార్య భర్తను నిలదీసింది. ఆ తర్వాత భర్తపై కేసు పెట్టింది.
తిరువనంతపురం: కేరళలో ఓ విచిత్ర ఘటన ముందుకు వచ్చింది. ఇదుక్కికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితురాలితో బైక్ పై కలిసి విహారం చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో కేరళలో రోడ్ సేఫ్టీ పేరిట ఏర్పాటు చేసిన కెమెరాలు వారి ఫొటో తీశాయి. ఆ బైక్ భార్య పేరిట రిజిస్టర్ అయి ఉండటంతో ట్రాఫిక్ కెమెరాలు తీసిన ఆ ఫొటో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారనే మెసేజీ రూపంలో భార్య మొబైల్ ఫోన్కు వెళ్లాయి. తన భర్త బైక్ పై మరో మహిళ కూర్చుని ఉండటం చూసి భార్య ఖంగుతిన్నది.
టెక్స్టైల్ షాప్లో పని చేసే 32 ఏళ్ల వ్యక్తి ఓ రోజు తన స్నేహితురాలిని బైక్ పై ఎక్కించుకుని ఏప్రిల్ 25వ తేదీన ప్రయాణించాడు. అయితే, అతను హెల్మెట్ పెట్టుకోలేదు. ఆ బైక్ భార్య పేరిట రిజిస్టర్ అయి ఉన్నది. కేరళలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలు హెల్మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యక్తి ఫొటోను క్యాప్చర్ చేశాయి. ఆ ఫొటోను బైక్ ఓనర్ అయిన ఆ వ్యక్తి భార్యకు మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్ పంపింది.
ఆ మెస్సేజీ రాగానే భార్య భర్తను నిలదీసింది. అతని వెనుక పిలియన్ రైడర్గా ఉన్న మహిళ ఎవరని అడిగింది. తనకు ఆమెకు ఏ సంబంధం లేదని, కేవలం లిఫ్ట్ అడిగితే ఇచ్చానని వివరించింది. కానీ, భార్య నమ్మలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
మే 5వ తేదీన కరమన పోలీసు స్టేషన్లో భర్తపై ఆమె కేసు పెట్టింది. తనను, తన మూడేళ్ల బిడ్డపై భౌతికంగా దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు.
