కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్కు హైకోర్టు బెయిల్
కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో తాజాగా బెయిల్ లభించింది. ఉగ్రవాద కోణంలో దాఖలైన కేసుల్లో సుప్రీంకోర్టు సెప్టెంబర్లోనే బెయిల్ ఇచ్చింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లో హథ్రాస్లో ఓ దళిత మహిళ హత్యాచారం ఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ను ఉగ్రవాద అభియోగాల కింద యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనిపై ఈడీ కూడా యాక్షన్ తీసుకుంది. అతనిపై ఉపా, ఇతర చట్టాల కింద నమోదైన కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చింది. తాజాగా,మనీ లాండరింగ్ కేసులోనూ అలహాబాద్ హైకోర్టు సిద్దిఖీ కప్పన్కు బెయిల్ మంజూరు చేసింది.
ఉపా, ఇతర చట్టాల కింద నమోదైన కేసుల్లో సుప్రీంకోర్టు కప్పన్కు సెప్టెంబర్లో బెయల్ మంజూరు చేసింది. కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసులో ఆయన ఇంకా లక్నో జైలులోనే ఉన్నారు.
ఈ నెల తొలినాళ్లలో సిద్దిఖీ కప్పన్, మరో ఆరుగురిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద లక్నో కోర్టు అభియోగాలు ఫ్రేమ్ చేసింది. కప్పన్తో పాటు కేఏ రౌఫ్ షెరిఫ్, అతికుర్ రెహమాన్, మసూద్ అహ్మద్, మొహమ్మద్ ఆలం, అబ్దుల్ రజాక్, అష్రఫ్ ఖాదిర్లు నిందితులుగా ఉన్నారు. వీరంతా నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ వింగ్ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు అని పోలీసులు ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాలు, టెర్రర్ ఫైనాన్సింగ్లలో తమ ప్రమేయం లేదని, తాము కేవలం పాత్రికేయ పని మీదనే హథ్రాస్కు ప్రయాణించి వచ్చామని వారు తెలిపారు.