కేరళలో చేపట్టనున్న హై స్పీడ్ రైలు కారిడార్ వల్ల నష్టపోతున్న వారికి నష్టపరిహారం ప్యాకేజీని సీఎం పినరయి విజయన్ మంగళవారం ప్రకటించారు. అర్హులైన వారికి ఉద్యోగాలు కలిస్తామని హామీ ఇచ్చారు. 

కేర‌ళ‌లో చేప‌ట్ట‌నున్న హై స్పీడ్ రైలు కారిడార్ వ‌ల్ల న‌ష్ట‌పోతున్న నిర్వాసితుల‌కు కేర‌ళ ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ మంగ‌ళ‌వారం న‌ష్ట‌ప‌రిహారం ప్యాకేజీని ప్ర‌క‌టించారు. ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా వ‌చ్చే నిర‌స‌న‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కారిడార్ వ‌ల్ల ఇళ్లు కోల్పోయిన వ్యక్తికి న‌ష్ట‌ప‌రిహారంతో పాటు మ‌రో రూ.4.60 ల‌క్ష‌లు అధ‌నంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే వారికి స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ లైఫ్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఒక ఇల్లు కూడా మంజూరు అవుతుంద‌ని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఐదు సెంట్ల భూమి, రూ.10 లక్షల పరిహారం అంత‌జేస్తామ‌ని చెప్పారు. అలాగే ప‌శువుల కొట్టాలు ఈ ప్రాజెక్టు కింద న‌ష్ట‌పోతే రూ.25 - 40 వేల ప‌రిహారం అందిస్తామ‌ని అన్నారు. 

క‌రోనా సోకినా.. ఆక్సిజన్ అవ‌స‌రమ‌య్యేవారు త‌క్కువే..!

అర్హుల‌కు ఉద్యోగాలు...
కేర‌ళ‌లో హై స్పీడ్ రైలు ప్రాజెక్టు కింద భూమిని, ఇళ్ల‌ను కోల్పొయే వారిలో అర్హులైన వారికి రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం విజయన్ హామీ ఇచ్చారు. ఇలా భూమిని కోల్పొయే వారికి మార్కెట్ ధ‌ర‌ల ప్ర‌కారమే న‌ష్ట‌ప‌రిహారం అందిస్తామ‌ని చెప్పారు. దీని కోసం రూ. 13,000 కోట్లు ప్ర‌భుత్వం కేటాయిస్తుంద‌ని తెలిపారు. నష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంద‌ని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సి ఉంద‌ని, దాని కోసం ఇలాంటి ప్రాజెక్టులు క‌డుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టుపై వ‌స్తున్న నిర‌స‌న‌ల‌కు ప్ర‌భుత్వం తలొగ్గ‌ద‌ని అన్నారు. 

ఈ ప్రాజెక్టు విశేషాలేంటి ? 
కేర‌ళా ప్ర‌భుత్వం ప్రాతిపాదించిన ఈ రైల్ కారిడార్ ప్రాజెక్టు కోసం రూ. 69, 941 కోట్లు వెచ్చించ‌నుంది. ఈ రైల్ కారిడార్ ఉత్తర కేరళలోని కాసర్‌గోడ్, దక్షిణాన తిరువనంతపురంలను కలుపుతుంది. ఈ ప్రాజెక్టుకు 1,383 హెక్టార్ల భూమి అవసరం అవుతోంది. ఇందులో మొత్తం 1,383 హెక్టార్లు భూమి ప్రైవేటు వ్య‌క్తుల చేతిలోనే ఉంది. ఈక్విటీ ఫండ్స్, విదేశీ రుణాలు, రైల్వే మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసే నిధుల ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే కాసరగోడ్ నుంచి తిరువనంతపురం మధ్య ఉన్న 529.45 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం నాలుగు గంటల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం కాస‌ర‌గోడ్ నుంచి తిరువ‌నంత‌పురం వెళ్లాలంటే 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. అయితే ఈ ప్రాజెక్టు 2025 నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్త‌వుతుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ఈ ప్రాజెక్టు వ‌ల్ల ఎంతో మంది రాష్ట్ర యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తోంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. 

బుల్లీ బాయ్ యాప్ కేసు.. కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఈ రైల్ ప్రాజెక్ట్ మొత్తం కేర‌ళలోని 11 జిల్లాల గుండా వెళ్ల‌నుంది. దీనిని రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు వ్య‌తిరేకిస్తున్నాయి. దీనిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. నిర‌స‌న‌లు చేప‌డుతున్నాయి. ఈ నిర‌స‌న‌లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ప్రాజెక్టును క‌చ్చితంగా పూర్తి చేయాల్సిందేనని సంక‌ల్పంతో ముందుకు వెళ్తోంది.