ప్రధాని మోడీతో భేటీ అయిన కేరళ సీఎం.. పలు కీలకంశాలపై చర్చ..
ప్రధాని నరేంద్ర మోదీని కేరళ ముఖ్యమంత్రి పినరయి మంగళవారం నాడు ఢిల్లీలో కలిశారు. ప్రధాని కార్యాలయంలో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్ సంసిద్ధత, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదం గురించి చర్చించినట్టు తెలుస్తోంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం నాడు న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. అనంతరం ప్రధాని కార్యాలయంలో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ మేరకు అధికారిక వర్గాలు ఓ ప్రకటనను వెల్లడించాయి. మరోసారి కోవిడ్ ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కోవడానికి కేరళ సంసిద్ధతపై సమావేశంలో చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడం, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చినట్టు తెలుస్తుంది.
ముందుగా ఇరునేతలు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సమయంలో సీఎం విజయన్ ప్రధాని మోదీకి కథాకళి శిల్పాన్ని బహుమతిగా ఇచ్చారని, వీరి సమావేశం ప్రధాని మోడీ అధికారిక నివాసంలో జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ తెలిపింది. అనంతరం ఇద్దరు నేతలు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో కలుసుకున్నారని స్పష్టం చేసింది.
ఇంతకుముందు.. బఫర్ జోన్, సిల్వర్లైన్ ప్రాజెక్ట్ , మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ సమస్యలు కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి, కేంద్రం అనుసరిస్తున్న వికృత విధానాలు, జీఎస్టీని అడ్డగోలుగా అమలు చేయడం, జీఎస్టీ పరిహారం చెల్లింపులో జాప్యం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రుణాల పరిమితిని తగ్గించడం వంటి కారణాలే ఇందుకు కారణమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే.. సమావేశంలో చర్చించిన ఈ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
సమావేశానికి సంబంధించిన ఫోటోలు మినహా, ఇతర వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) విడుదల చేయలేదు. ఈ సమావేశంలో ఈఎస్జెడ్ అంశంపై చర్చించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. అంతేకాకుండా, ఉత్తరాన కాసర్గోడ్ నుండి దక్షిణాన తిరువనంతపురం వరకు కలిపే సెమీ-హై స్పీడ్ రైలు ప్రాజెక్టు అయిన సిల్వర్లైన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడంలో ఆలస్యం గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది.