భారత ఆయుర్వేద చికిత్స మరోసారి దాని సామర్థ్యాన్ని వెల్లడించింది. ఎంతో అభివృద్ధి సాధించిన దేశాల్లోని పద్ధతులూ సాధించని పనిని.. ఆయుర్వేదం సాధ్యం చేసి చూపించింది. 2017లో కంటిచూపు కోల్పోయిన కెన్యా మాజీ ప్రధాని కూతురుకు ఆయుర్వేదం మళ్లీ చూపును ప్రసాదించింది. ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకే సాధ్యం కాని అద్భుతాన్ని కేరళ ఆయుర్వేదం సాధ్యం చేసింది. ఈ ఆయుర్వేదాన్ని తమ దేశంలోనూ ప్రారంభిస్తామని కెన్యా మాజీ ప్రధాని అన్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రధాని మోడీని కోరారు.
న్యూఢిల్లీ: కెన్యా(Kenya) మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా కూతురు రోస్మేరీ ఒడింగాకు(Rosemary Odinga) మన దేశంలోని కేరళ(Kerala)లో ఆయుర్వేద వైద్యంతో(Ayurveda Treatment) కంటిచూపు(Vision) వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్తో ఆమెకు కంటిచూపు పోయింది. జర్మనీ, ఇజ్రాయెల్, చైనా వంటి ఎన్నో దేశాల్లో ఆమెకు మళ్లీ కంటి చూపు రావడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఎన్నో విధాల చికిత్స అందించారు. కానీ, ఆమెకు కంటి చూపు రాలేదు. కేరళలో ఆయుర్వేద చికిత్సతో పోయిన కంటిచూపును రప్పిస్తారనే విషయాన్ని తెలుసుకుని ఇక్కడకు వచ్చారు. నాలుగు నెలలు ఆయుర్వేద చికిత్స పొందిన తర్వాత ఆమెకు కంటిచూపు వచ్చింది.
కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా ఆ దేశంలో మంచి ఆదరణ ఉన్న నేత. ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉన్న నాయకుడు. తాను త్వరలోనే కెన్యా అధ్యక్షుడు అయిన తర్వాత తమ దేశంలోనూ శ్రీధరీయం తరహా ఆయుర్వేద చికిత్స అందించే వసతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఆయుర్వేద చికిత్సను తమ దేశంలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, కంటిచూపును తెప్పించే ఆయుర్వేదం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. రైలా ఒడింగా ఆదివారం ప్రధాని మోడీని కలిశారు.
బ్రెయిన్ ట్యూమర్ కారణంగా రోస్మేరీ ఒడింగా 2017లో కంటిచూపును కోల్పోయారు. ఆమె దాదాపుగా ఏమీ చూడలేని స్థితికి చేరుకున్నారు. ఆమె కంటిచూపు కోసం ఎన్నో దేశాలు తిరిగింది. దక్షిణాఫ్రికా సహా జర్మనీ, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలు తిరిగిన ఆమెకు కంటిచూపు రాలేదు. ఈ సమయంలోనే వారు కేరళ ఎర్నాకుళంలోని కూతట్టుకులంలోని శ్రీధరీయం ఆయుర్వేదిక్ ఐ కేర్ హాస్పిటల్ గురించి విన్నారు. అక్కడకు వచ్చేసి చీఫ్ ఫిజీషియన్ నారాయణన్ నంబూద్రి సారథ్యంలోని బృందంతో కంటి చికిత్సను తీసుకున్నారు.
ఈ చికిత్స తీసుకున్న నాలుగు నెలల్లోనే ఆమెకు కళ్లు మళ్లీ కనిపించడం మొదలయ్యాయి. ఇప్పుడు ఆమె ఫోన్లోని టెక్స్ట్ మెసేజెస్ కూడా స్పష్టంగా చూడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె తిరిగి కెన్యా వెళ్లిపోయారు. చికిత్స అందించినవారికి కృతజ్ఞతలు తెలుపడానికి, అదే విధంగా ఆయుర్వేద చికిత్సలో ఫాలోఅప్ టెస్టుల కోసమూ ఆమె తండ్రి, కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగాతో రోస్మేరీ ఒడింగా భారత్కు ఈ నెల 7వ తేదీన వచ్చారు. ఈ నెల 28వ తేదీ వరకు భారత్ లోనే ఉండనున్నారు.
