దేశాన్ని రక్షించాలనే కేసీఆర్ యత్నాలు.. కొత్త ఫ్రంట్ అందుకే : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
దేశాన్ని రక్షించుకోవాలనే లక్ష్యంతోనే కొత్త ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. పేద ప్రజల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.
బెంగుళూరులో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ (hd deve gowda) , కర్నాటక (karnataka) మాజీ సీఎం కుమారస్వామిలను (hd kumaraswamy) ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) కలిశారు. అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం అనేక మంది నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నట్లు కుమారస్వామి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ఫ్రంట్కు ప్రయత్నిస్తున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం మార్పు అవసరం అని, పేద ప్రజల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.
ALso Read:రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెబుతా : బెంగళూరులో కేసీఆర్ కీలక ప్రకటన
అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని.. దీనిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేసీఆర్ దుయ్యబట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోయిందని.. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్ధికశక్తిగా భారత్ను తీర్చిదిద్దొచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దేశంలో మార్పు తథ్యమని.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. భారతదేశ జీడీపీని సైతం చైనా అధిగమించిందని గుర్తుచేశారు. మనదేశంలో పుష్కలమైన మానవ వనరులు వున్నాయని.. అమోఘమైన యువశక్తి వుందని కేసీఆర్ తెలిపారు. అభివృద్ధిలో చైనా మనదేశాన్ని దాటికి దూసుకుపోతోందన్నారు