యమరాజా పో పో: కరుణ ఆరోగ్యంపై ఆందోళన, ముగ్గురు మృతి
యమరాజా పో పో, తలైవర్ ను వెనక్కి ఇవ్వు అంటూ నినాదాలు చేస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందనే వార్తలు రావడంతో ఇద్దరు గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించిందనే ఆరోపణలు రావడంతో డీఎంకె కార్యకర్తలు కావేరీ ఆస్పత్రి నుంచి కదలడానికి నిరాకరిస్తున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఆస్పత్రి వద్ద కాచుకుని కూర్చున్నారు.
యమరాజా పో పో, తలైవర్ ను వెనక్కి ఇవ్వు అంటూ నినాదాలు చేస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందనే వార్తలు రావడంతో ఇద్దరు గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కరుణానిధి ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పాలని డిఎంకె కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడుతోందని స్టాలిన్, కనిమొళి, రాజా విజ్ఞప్తులు చేసినా వారు వినడం లేదు.
గోపాలపురంలోని కరుణానిధి నివాసం వద్దకు కూడా పెద్ద యెత్తున డిఎంకె కార్యకర్తలు చేరుకున్నారు. కరుణానిధిని శుక్రవారంనాడు కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, ఆస్పత్రి నుంచి కరుణానిధి నివాసం వరకు గల రహదారిని పోలీసులు క్లియర్ చేశారు. చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారంనాటి తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఆయన కరుణానిధిని పరామర్శించనున్నారు.