హైకోర్టు తీర్పుతో కన్నీటి పర్యంతమైన స్టాలిన్
తన తండ్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా స్క్వేర్ లో జరపడానికి అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే డిఎంకె నేత స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చుట్టు డిఎంకె నేతలు ఉన్నప్పటికీ ఆయన ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు.
చెన్నై: తన తండ్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా స్క్వేర్ లో జరపడానికి అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే డిఎంకె నేత స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చుట్టు డిఎంకె నేతలు ఉన్నప్పటికీ ఆయన ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు. ఇది ప్రజా విజయమని ఆయన అన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆ సమాచారం అందిన వెంటనే వేలాది మంది మద్దతుదారులు ఒక్కసారిగా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. బీచ్ లో నిరీక్షిస్తున్న పలువురికి ఆ సమాచారం ఎంతో ఆనందాన్నిచ్చింది. గుంపును నియంత్రించడానికి పెద్ద యెత్తున పోలీసులను, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను పిలిపించారు.
కరుణానిధికి కడపటి వీడ్కోలు చెప్పడానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బారులు తీరారు. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం చెన్నై చేరుకుని కరుణానిధికి నివాళులు అర్పించారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్ లో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెద్ద యెత్తున కరుణానిధి అభిమానులు, డిఎంకె మద్దతుదారులు తరలి వచ్చారు. ఈ సమయంలో కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ వెలుపల పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొద్ది మంది గాయపడ్డారు.
గుంపును నియంత్రించడానికి పోలీసులు బాటోన్స్ కూడా వాడారు. మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు అనుమతి ఇవ్వబోమని హైకోర్టులో ప్రభుత్వం గట్టిగా వాదించింది. అయితే, చివరకు హైకోర్టు డిఎంకెకు అనుకూలంగానే తీర్పు వెలువరించింది.