జనంనాడి తెలిసిన నేత కరుణానిధి
డీఎంకె చీఫ్ కరుణానిధి జనం నాడి తెలిసిన నేతగా పేరుంది. ప్రజల నాడిని తెలుసుకొని వ్యవహరించడం కరుణకు వెన్నతో పెట్టిన విద్యగా చెబుతుంటారు.
చెన్నై:డీఎంకె చీఫ్ కరుణానిధి జనం నాడి తెలిసిన నేతగా పేరుంది. ప్రజల నాడిని తెలుసుకొని వ్యవహరించడం కరుణకు వెన్నతో పెట్టిన విద్యగా చెబుతుంటారు. తమిళనాడు సీఎంగా కరుణానిధి ఐదు దఫాలు బాధ్యతలను చేపట్టడంలో కరుణానిది జనం నాడి తెలిసిన నేత కావడమే ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
ప్రజా చైతన్యాన్ని రాజకీయ శక్తిగా మలుచుకోవడంలో కరుణానిధిని మించిన వారు ఉండరని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందుకే ఆయన చేపట్టిన ఉద్యమాలు, కార్యక్రమాలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
14 ఏళ్ల వయస్సులోనే జస్టిస్ పార్టీ నేత అళగిరి స్వామి చేసిన ఉపన్యాసానికి ప్రభావితుడైన కరుణానిధి ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థి విభాగాన్ని ప్రారంభించి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. విద్యార్థిగా ఉన్న కాలంలోనే ఆయన తన సహచరుల కోసం మానవర్ నెసన్ అనే రాతపత్రికను కూడ ఆయన నడిపారు.
ప్రజల నాడిని పట్టడంలో ఆయనకు ఆయన సాటిగా చెబుతారు. అందుకే ఆయన సీఎంగా ఉన్న కాలంలో పేదలకు బియ్యం సరఫరా చేయడం లాంటి పథకాలను ప్రారంభించారు. తమిళం అనేది అమ్మ చేతి వంటలాంటిదని, పిల్లల ఇష్టాయిష్టాలు అమ్మకే తెలుస్తాయని కరుణ నమ్ముతారు. హిందీ భాష హోటల్ నుండి తెప్పించుకొనే భోజనం లాంటిదని కరుణానిధి చెప్పేవాడని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకొంటున్నారు.
ద్రవిడ ఉద్యమాన్ని సాంఘిక సంస్కరణలకే పరిమితం కాకుండా రాజకీయ ఉద్యమంగా మార్చడం వల్లే తమిళనాడుకు మేలు జరిగిందని కరుణానిధి భావిస్తారు. కులాంతర వివాహలను ప్రోత్సహించారు. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కును కల్పించారు. ఏ వర్గానికి చెందిన వారైన పూజారులుగా నియమించే చట్టాలను తీసుకొచ్చారు. ప్రజలు ఏం కోరుకొంటున్నారో ఆ రకమైన పనులకు కరుణానిధి శ్రీకారం చుట్టి ప్రజల మెప్పును పొందారు.
ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకుగాను మురసోలి అనే పత్రికను కూడ నడిపారు కరుణానిధి.తొలుత దీన్ని మాస పత్రికగా, వారపత్రికగా ఆ తర్వాత దినపత్రికగా రూపాంతరం చెందింది. ఈ పత్రికను ప్రచురించినపుడు ఆయనకు పద్దెనిమిదేళ్లు. మొదట్లో అది మాసపత్రికగా ఉండి తరువాత వార పత్రికగా అటుపై దినపత్రికగా రూపాంతరం చెందింది.
దీనజనబంధు పెరియార్ రామస్వామి నాయకర్ శిష్యుడినని కరుణానిధి గర్వంగా చెప్పుకొంటారు. ద్రవిడ కజగం పతాకాన్ని పెరియార్తో కలిసి రూపొందించారు. అందులోని ఉదయ భానుడిని తన రక్తంతో చిత్రించారు. 1949లో పెరియార్తో విభేదించి స్థాపించిన ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) వ్యవస్థాపకుల్లో ఒకరు.