మంత్రికి వార్నింగ్

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరికి శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మంత్రి చేసిన తాజా ‘ ఎలుక’ వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు. కర్ణిసేన వర్గ ప్రజలకు మంత్రి క్షమాపణలు చెప్పకపోతే ఆమె చెవులు, ముక్కు కోసేస్తామని హెచ్చరించారు. అంతేకాదు త్వరలో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు కంకణం చుట్టుకున్నారు. ఈ మేరకు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలుపెట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ప్రచారంపై మంత్రి మహేశ్వరి స్పందిస్తూ.. ఇక్కడ కొంతమంది ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రంధ్రాల నుంచి ఎలుకల్లా బయటకు వస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సంఘర్ష్ సమితి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే కర్ణిసేన వర్గానికి మంత్రి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజ్‌పుత్ కమ్యూనిటీ సహాయంతోనే బీజేపీ రాజస్థాన్‌లో కొంత బలంగా ఉంది.

చివరి అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్ ప్రజల ఓట్ల సహాయంతోనే మహేశ్వరి గెలిచారు. ఈ మంత్రి నియోజకవర్గంలోనే 40 వేల మంది రాజ్‌పుత్‌లు ఉన్నారు. అయితే కర్ణిసేన చేస్తున్న డిమాండ్‌పై మంత్రి మహేశ్వరి స్పందించారు. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని మంత్రి వివరణ ఇచ్చారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ స్పందిస్తూ.. మహేశ్వరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.