మిస్ దివా యూనివర్స్ 2022 : కిరీటాన్ని దక్కించుకున్న కర్ణాటక సుందరి దివితా రాయ్...
కర్నాటకకు చెందిన 23 ఏళ్ల దివితా రాయ్ మిస్ దివా యూనివర్స్ 2022 ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకుంది. ప్రతిష్టాత్మకమైన పోటీల 10వ వార్షికోత్సవంలో మిస్ యూనివర్స్ 2021, హర్నాజ్ సంధు ఆమెకు ఈ మేరకు పట్టాభిషేకం చేసింది.
మిస్ యూనివర్స్ ఇండియా 2022 : మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన దివితా రాయ్ దక్కించుకుంది. మిస్ దివా యూనివర్స్ పోటీ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలో 23 ఏళ్ల ఈ అందాల రాణి టైటిల్ను కైవసం చేసుకుంది. మిస్ యూనివర్స్ 2021, హర్నాజ్ సంధు, దివితా రాయ్ కు కిరీటం ధరింపచేసింది. తెలంగాణకు చెందిన ప్రజ్ఞ అయ్యగారి మిస్ దివా సుప్రానేషనల్ 2022గా ప్రకటించబడింది. మిస్ యూనివర్స్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ హర్నాజ్ ఆమె వారసురాలి దివితా రాయ్కి పట్టాభిషేకం చేసినప్పటి ఉద్వేగభరితమైన క్షణాల వీడియోను షేర్ చేసింది.
ఆదివారం రాత్రి, హర్నాజ్ సంధు దివితా రాయ్కి తదుపరి మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటాన్ని అందజేసారు. మిస్ యూనివర్స్ పేజీ షేర్ చేసిన వీడియోలో దివితాకు కిరీటాన్ని పెట్టడానికి ముందు హర్నాజ్ మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని ముద్దాడినట్లు కనిపిస్తోంది. ఆ తరువాత, ఈ ఇద్దరు అందాల రాణులు తమ తమ కిరీటాలను ధరించి, టైటిల్స్ ను వేసుకుని.. అందమైన దుస్తుల్లో మెరిసిపోతూ వేదికపైన వాక్ చేశారు.
కర్ణాటకలో జన్మించిన దివితా రాయ్ తండ్రి ఉద్యోగం కారణంగా భారత్ లోని అనేక నగరాల్లో పర్యటించింది. 23 ఏళ్ల ఆమె వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్, మోడల్.. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, పెయింటింగ్, సంగీతం వినడం, చదవడం వంటి వాటిపై అభిరుచి, ఆసక్తి కలిగి ఉంది. ఈ పోటీలతో ఆమె 71వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనుంది. మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు తన వారసురాలికి కిరీటం ఇస్తుంది.
మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత, దివిత మిస్ యూనివర్స్ అధికారిక పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో తన సంతోషాన్ని పంచుకుంది. "ఇది క్రేజీగా అనిపిస్తుంది. చివరకు నా తలపై ఇదిగో ఇది ఉంది [కిరీటం చూపిస్తూ]. నమ్మశక్యం కావడం లేదు. మాటలు రావడం లేదు.. ఇది చాలా క్రేజీగా ఉంది’ అని మిస్ దివా యూనివర్స్ 2022 పేర్కొంది.
మిస్ దివా యూనివర్స్ 2022 పోటీకి చాలామంది తారలు, మాజీ అందాల పోటీ విజేతలు హాజరయ్యారు. మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా, మిస్ ఇండియా 1964 మెహర్ కాస్టెలినో, మిస్ ఇండియా 1980 సంగీతా బిజ్లానీ, మిస్ ఇండియా యూనివర్స్ 2004 తనుశ్రీ దత్తా కూడా ఈ ఈవెంట్లో కనిపించారు.