కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి పోటీలో నిలుస్తున్నారు.
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈ సారి కోలార్ స్థానం నుంచి పోటీ చేయడం లేదు. దీనికి భిన్నంగా వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి అంతకు ముందు ఆయన కుమారుడు యతీంద్ర పోటీలో ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు సిద్ధరామయ్య కోసం కుమారుడు యతీంద్ర తన సీటును త్యాగం చేశారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో ఉండగా.. కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన విపక్షం కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.
గతంలో చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల్లో సిద్ధరామయ్య అనేకసార్లు విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గాన్ని కొడుకు యతీంద్ర కోసం సిద్ధరామయ్య త్యాగం చేశారు. ఆయన బదామీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన కోలారు నుంచి పోటీ చేయాలనుకున్నారు. అధిష్టానంతో కూడా దీనిమీద చర్చలు జరిపారు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు కోలారు నుంచి పోటీ చేయద్దని సూచించారని తెలిసింది.
రాహుల్ గాంధీ సూచనల మేరకే వరుణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర.. తండ్రి కోసం తన స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఫలితంగానే సిద్ధరామయ్య వరుణ నుంచి బరిలోకి దిగారు. ఈరోజు కాంగ్రెస్ కర్ణాటక అసెంబ్లీకి ప్రకటించిన తమ అభ్యర్థుల జాబితాలో అందుకే మాజీ సీఎం సిద్ధరామయ్య పేరు వరుణ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా మరోవైపు తండ్రి కోసం తన సీటును త్యాగం చేసిన యతీంద్ర వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిమీద స్పష్టత లేదు. తాజా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన దిగకపోవచ్చేమో అని వినిపిస్తోంది. కర్ణాటకలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో యతీంద్రకు ఎంపీ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ శనివారం 124 మందితో తన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో సిద్ధరామయ్య వరుణ నుంచి పోటీ చేస్తుండగా.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చిత్తాపూర్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, కోరటగెరె స్థానం నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వర బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడు మే నెలలో ప్రస్తుత శాసనసభ గడువు ముగుస్తుంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కాగా, ఈ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్సే.
