‘ఎగ్జామ్ రాసేటప్పుడు చీటింగ్ చేయడంలో నాకు పీహెచ్డీ ఉన్నది’.. విద్యార్థులతో కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు
పరీక్షలు రాసేటప్పుడు చీటింగ్ చేయడం గురించి కర్ణాటక మంత్రి బి శ్రీరాములు మాట్లాడారు. తన పదో తరగతి పరీక్షలను చీటింగ్ చేసే పాస్ అయ్యానని వివరించారు.
బెంగళూరు: పిల్లలు బుద్ధిగా చదువుకోవాలని, జ్ఞానం పెంపొందించకోవాలని పెద్దలు చెబుతారు. నైతిక విలువలూ బోధిస్తారు. పరీక్షల్లో కాపీ కొట్టవద్దని, చీటింగ్ పనికి రాదని చెబుతారు. కానీ, కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీ శ్రీరాములు మాత్రం వీటికి అతీతంగా వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు.
కర్ణాటక బళ్లారీ జిల్లాలో విద్యార్థులతో మాట్లాడారు. తన ప్రసంగంలో ఆయన పదో తరగతి పరీక్ష ఎలా ఉత్తీర్ణుడయ్యాడో వివరించారు.
‘ప్రతి రోజు ట్యూషన్లో నాకు అవమానమే జరిగేది. నాకే ఏదీ చేతకాదని అనేవారు. కానీ, నేను పదో తరగతి పాస్ కాగానే మా టీచర్ ఆశ్చర్యంలో మునిగారు. అప్పుడు నేను మా టీచర్తో ఇలా అన్నాను. పదో తరగతి పరీక్షలను నేను చీటింగ్ చేసి పాస్ అవ్వడమే కాదు.. పరీక్షలు రాసే సమయంలో చీటింగ్ చేసే సబ్జెక్టులో నాకు పీహెచ్డీ ఉన్నదని చెప్పాను’ అని మంత్రి శ్రీరాములు తెలిపారు.
Also Read: మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదం: ఈ నెల 14న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ లీడర్, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ పై అసభ్య పదజాలం వాడిన తర్వాతి రోజు తాజాగా మంత్రి బి శ్రీరాములు ఈ వ్యాఖ్యలు చేశారు.