మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదం: ఈ నెల 14న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
New Delhi: కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం నేపథ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం కర్ణాటక పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయ్యే అవకాశముందని సమాచారం. సరిహద్దు వివాదంపై రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు బహిరంగంగా వాగ్వివాదాలకు దిగడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ఘర్షణకు దారితీసింది.
Karnataka-Maharashtra Border Dispute: కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరింతగా ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో ఆయా నాయకుల బహిరంగ ప్రకటనలు బీజేపీలో ఘర్షణకు దారి తీశాయి. ఈ ఉద్రిక్త వాతావరణానికి ముంగింపు చెప్పెందుకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం నేపథ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం కర్ణాటక పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయ్యే అవకాశముందని సమాచారం. బెళగావి సరిహద్దు వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేలు సమావేశం కానున్నారు. సరిహద్దు వివాదంపై ఇరువురు ముఖ్యమంత్రులు డిసెంబర్ 14, 15 తేదీల్లో చర్చించనున్నారు.
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై వచ్చే వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో సమావేశం జరుగుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం తెలిపారని ఏఎన్ఐ నివేదించింది. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదంపై డిసెంబర్ 14 లేదా 15 న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం జరుగుతుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని కూడా ఆయన చెప్పారు.
'మా ఎంపీలు కేంద్ర హోంమంత్రిని కలిసి కర్ణాటక వైఖరిని వివరించనున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య శాంతి నెలకొనేలా అమిత్ షా త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆయన ఫోన్ చేసిన వెంటనే నేను వెళ్లి సమావేశానికి హాజరవుతాను' అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఈ అంశంపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని బొమ్మై చెప్పారు. ఈ విషయంపై తాను మాజీ సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో అనధికారికంగా మాట్లాడినట్లు ఆయన చెప్పారు. వారితో సంప్రదించిన తరువాత సమావేశ తేదీని నిర్ణయిస్తారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడతానని చెప్పారు. మంగళవారం జరిగిన సంఘటనలపై తాను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో మాట్లాడినట్లు ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో చెప్పారు. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దనీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు శాంతిని కాపాడాలని ఆయన కోరారు. "మహారాష్ట్ర శాంతిభద్రతలకు ప్రసిద్ధి చెందిందనీ, మహారాష్ట్ర ప్రజలు శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దనీ, సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని నేను అభ్యర్థిస్తున్నాను. తమ ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా కర్ణాటకపై ఉందన్నారు. ఈ రకమైన సంఘటన సరైనది కాదనీ, ఇది మళ్లీ జరగదని నేను వారికి చెప్పాను. ప్రభుత్వ బస్సులపై రాళ్లు రువ్వడం, ధ్వంసం చేయడం రెండు వైపులా సరికాదు" అని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.