ప్రధాని మోదీ ఫొటోకు ముద్దు పెట్టిన కర్ణాటక రైతు.. ప్రపంచాన్నే జయిస్తారని భావోద్వేగం.. (వీడియో)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఓ రైతు.. బస్సుపై అంటించి ఉన్న ప్రధాని మోదీ ఫొటోకు భావోద్వేగంతో ముద్దు పెట్టారు.
కర్ణాటక అసెబ్లీ ఎన్నికలకు నగరా మోగిన సంగతి తెలిసిందే. మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బస్సుపై అంటించి ఉన్న G20 సమ్మిట్కు సంబంధించిన ప్రకటపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోకు ఓ రైతు ముద్దు పెడుతున్నాడు. అలాగే మోదీ ప్రపంచాన్ని జయిస్తారని కూడా చెబుతున్నాడు.
వివరాలు.. కర్ణాటకలో కేఎస్ఆర్టీసీ బస్సుకు అంటించి ఉన్న పోస్టర్లో ప్రధాని మోదీ ఫోటోను ముద్దాడుతున్న రైతు.. ‘‘నాకు వెయ్యి రూపాయలు వచ్చేవి.. నాకు రూ. 500 ఎక్కువ వచ్చేలా చేశావు. మా ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. ప్రపంచాన్నే జయిస్తావు’’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆ రైతు భావోద్వేగానికి గురయ్యారు.
ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. కర్ణాటకలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్టుగా సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మే 10న పోలింగ్ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టుగా తెలిపారు. షెడ్యూల్.. ఏప్రిల్ 13 గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ.. ఏప్రిల్ 20. నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 21. నామినేషన్ల ఉపసంహరణ గడవును ఏప్రిల్ 24గా నిర్ణయించారు. మే 10న పోలింగ్ నిర్వహించనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కర్ణాటకలో మొత్తం 5.2 కోట్ల ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫస్ట్ టైమ్ ఓటర్స్ 9.17 లక్షలు, పీడబ్ల్యూడీ ఓటర్స్ 5.5 లక్షలు ఉన్నారని చెప్పారు. ఇక, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు(పీడబ్ల్యూడీ) వారి ఇళ్ల నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టుగా చెప్పారు.