కూటమి కుప్పకూలుతుందని.. 2018లోనే తెలుసు: కుమారస్వామి
సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని తనకు ముందే ఊహించానన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి బీజేపీ తమను టార్గెట్ చేసిందని.. తాము ప్రభుత్వాన్ని విస్తరించుకునే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం కూల్చేసే ప్రయత్నాలు చేసిందని కుమారస్వామి ఆరోపించారు
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం ఏంటన్న దానిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని తనకు ముందే ఊహించానన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి బీజేపీ తమను టార్గెట్ చేసిందని.. తాము ప్రభుత్వాన్ని విస్తరించుకునే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం కూల్చేసే ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు.
దీంతో పాటు కాంగ్రెస్లోనూ అంతర్గత కుమ్ములాటలు ఉండటం సైతం సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ఆజ్యం పోసిందని కుమారస్వామి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడానికి మరింతగా ప్రయత్నించారని మాజీ సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ముందే ఊహించినందున.. తనకు ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించలేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని తాను ముందే అనుకున్నానని.. కానీ వారి సమస్య నేనే అని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపించారని ఆయన తెలిపారు. జేడీఎస్ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరూ నాతో మాట్లాడలేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు.