Karnataka Election 2023: కర్నాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి..? : మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
Karnataka Assembly Election 2023: "గడిచిన ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీరును చూసి ప్రజలు విసిగిపోయారు, ఎందుకంటే వారు అవినీతిని ప్రోత్సహించారు. బహిరంగంగానే 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లే నిరూపించారు. అందుకే బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు... కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు" అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అలాగే, సీఎం అభ్యర్థి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress National President Mallikarjun Kharge: కర్నాటక రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై మరొకరు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్ర రాజకీయల్లో హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ బీజేపీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. కర్నాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ ఒక పద్దతిని అనుసరిస్తామనీ, తమ అసెంబ్లీ సభ్యులు దీనిని నిర్ణయిస్తారని తెలిపారు.
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ స్పందించారు. ఇండియా టుడే కర్ణాటక రౌండ్ టేబుల్ 2023 లో ఖర్గే మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత, శాసనసభ్యులు ఎవరిని ఎన్నుకుంటారో లేదా మద్దతు ఇస్తారో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. "మేము ఎల్లప్పుడూ ఒక పద్ధతిని అనుసరిస్తాము. శాసనసభ్యులు ఎవరిని ఎన్నుకున్నా, ఎవరికి మద్దతిచ్చినా పరిగణనలోకి తీసుకుంటాము. శాసనసభ్యుల సంఖ్యాబలం, మద్దతు ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయమే అంతిమమని" మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఇదే క్రమంలో హైకమాండ్ గురించి ప్రశ్నించగా, హైకమాండ్ ఒక వ్యక్తి కాజాలదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. "హైకమాండ్ అంటే సమిష్టి నాయకత్వం. మా వర్కింగ్ కమిటీ ఉంది, పార్లమెంటరీ బోర్డు ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా మా సీనియర్ నాయకులు ఉన్నారు. సమష్టిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం" అని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థినన్న ఊహాగానాలపై ఖర్గే స్పందిస్తూ.. 'మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమించే సామర్థ్యం నాకు ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిని కావాలని ఎందుకు చెబుతారు. నేను కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఆశావహుడిని కాదు, నేను ముఖ్యమంత్రులను నియమిస్తాను" అని చెప్పారు.
అలాగే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. "మా పని వల్ల మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఈసారి మా పార్టీ ఒక్కటిగా పనిచేస్తోంది. రెండవది, ప్రస్తుత ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వం. అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని" అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. "గడిచిన ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీరును చూసి ప్రజలు విసిగిపోయారు, ఎందుకంటే వారు అవినీతిని ప్రోత్సహించారు. బహిరంగంగానే 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లే నిరూపించారు. ఇది చాలు, వారు ఇతరుల నుండి రక్షణ పొందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అందుకే అవినీతి, మౌలిక సదుపాయాల లేమి, కుల, రిజర్వుడ్ వర్గాల మధ్య విభజన - దుర్మార్గాలు చేస్తున్న బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు... కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు" అని ఖర్గే అన్నారు. కాగా, కర్ణాటకలో మొత్తం 224 మంది అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్లను లెక్కించి మే 13న ఫలితాలు ప్రకటిస్తారు.