కుమారస్వామికి మరో షాక్... మంత్రి రాజీనామా
కర్ణాటకలో రాజకీయం రోజు రోజుకీ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టగా.. తాజాగా ఓ మంత్రి కూడా రాజీనామా చేశారు.
కర్ణాటకలో రాజకీయం రోజు రోజుకీ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టగా.. తాజాగా ఓ మంత్రి కూడా రాజీనామా చేశారు. కర్ణాటక మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సోమవారం గవర్నర్ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణానికి మద్దతు తెలిపిన నగేష్.. కుమారస్వామి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూడా రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
నగేష్ ముల్బగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసిన ఆయన ముంబైలోని రెబల్ ఎమ్మెల్యేల క్యాంపుకు తరలివెళ్లనున్నట్లు తెలిసింది. ఒకవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు సీఎం కుమారస్వామి ప్రయత్నిస్తుంటే మరోవైపు నగేష్ రాజీనామా సీఎంను మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. కాగా ఈయన కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.