కర్ణాటక క్రైసిస్: బీజేపీ ఎమ్మెల్యేలతో టిఫిన్ చేసిన డిప్యూటీ సీఎం పరమేశ్వర
అసెంబ్లీలోనే ధర్నా నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పరమేశ్వర శుక్రవారం నాడు కలిశారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అల్పాహారం తీసుకొన్నారు.
బెంగుళూరు: అసెంబ్లీలోనే ధర్నా నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పరమేశ్వర శుక్రవారం నాడు కలిశారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అల్పాహారం తీసుకొన్నారు.
గురువారం నాడే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహిస్తున్నారు. రాత్రి అసెంబ్లీలోనే బీజేపీ ఎమ్మెల్యేలు పడుకొన్నారు. ఉదయం పూట అసెంబ్లీ ఆవరణలోనే మార్నింగ్ వాక్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలోనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం పరమేశ్వర కలిశారు. వారితో కలిసి టిఫిన్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకొన్నారు.చాలా మంది ఎమ్మెల్యేల్లో కొందరు బీపీ, షుగర్ ఉన్నవారు కూడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కర్ణాటక అసెంబ్లీలో ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మరో ముగ్గురు జేడీ(ఎస్)కు చెందినవారు ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వం బలం అసెంబ్లీలో 117గా ఉంది. కాంగ్రెస్కు 78. జేడీ(ఎస్)కు37 మంది సభ్యుల బలం ఉంది. బీఎస్పీ, నామినేటేడ్ సభ్యులు ఒక్కొక్కరు ఉన్నారు.
బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. కర్ణాటక అసెంబ్లీలో 225 మంది సభ్యుల సంఖ్య. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కుమారస్వామి ప్రభుత్వం బలం 101కు చేరుకొంటుంది. అదే జరిగితే కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోతోంది.
కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటలోపుగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదేశించారు. గురువారం నాడు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్కు గవర్నర్ వాజ్భాయ్ వాలా లేఖ పంపారు.ఈ లేఖను స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో చదివి విన్పించారు.
ఈ లేఖపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్పీకర్ను ఆదేశించే హక్కు గవర్నర్కు లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
కర్ణాటక బలపరీక్ష...సభలోనే నిద్రించిన బీజేపీ నేతలు