బిజెపి నేత దారుణ హత్య,వెంటాడి కత్తులతో నరికి చంపిన దుండగులు
కర్ణాటక చిక్మగళూరు లో దారుణం...
కర్ణాటక లో ప్రతిపక్ష బిజెపి పార్టీకి చెందిన ఓ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిక్మగళూరు బిజెపి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అన్వర్ ను కొందరు దుండగులు కత్తలతో దారుణంగా నరికి హత్య చూశారు. ఈ హత్యతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మైనారిటీ నేత మహమ్మద్ అన్వర్ నిన్న గౌరీ కెనాల్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ముగించుకుని ఇంటికి తన బైక్ పై ఒంటరిగా బయలుదేరాడు. అయితే అతడి కదలికలపై నిఘా ఉంచిన నిందితులు ఒంటరిగా ఉన్న అన్వర్ ను గుర్తించారు. దీంతో ఇదే అదునుగా భావించి అన్వర్ ను కత్తులతో వెంటాడి విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న అన్వర్ పూర్తిగా ప్రాణం వదిలే వరకు అక్కడే ఉన్నారు.అతడు మృతిచెందాడని నిర్ధారణ చేసుకున్నాకే దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
అయితే ప్రతిపక్ష బిజెపి కి చెందిన కీలకమైన మైనారిటీ నేత హత్యకు గురవడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటా అవాంచనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.