వారి దాడి నుంచి తప్పించుకుని.. అడవిలో దాదాపు 15 కిలోమీటర్లు పరిగెత్తి.. ప్రాణాలు కాపాడుకున్నా..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ సంచలన ఆరోపణలు చేశారు. తనపై బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, అతడి అనుచరులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు చేశారు. వారిని నుంచి తప్పించుకోవడానికి దాదాపు 15 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరుగుతోన్న వేళ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ సంచలన ఆరోపణలు చేశారు. దంతా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ మరోసారి అదే స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే.. తనపై బిజెపి అభ్యర్థి లధు పర్ఘితో పాటు ఎల్కె బరాద్ , అతని సోదరుడు వదన్ జీ లు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు చేశారు. వారి నుంచి తప్పించుకుని.. తన ప్రాణాలు కాపాడుకోడానికి దాదాపు 15 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ మీడియాతో మాట్లాడుతూ.. `తనపై బీజేపీ అభ్యర్థి దాడి చేశాడని, దీంతో తాను తప్పించుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. తనపై బిజెపి అభ్యర్థి లధు పర్ఘితో పాటు ఎల్కె బరాద్, అతని సోదరుడు వదన్ జీ దాడి చేశారనీ, వారు కత్తులతో ఎగబడ్డారు. మా వాహనాలు బమోదర నాలుగు-మార్గం గుండా వెళుతుండగా, తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ అభ్యర్థి తమ దారిని అడ్డుకున్నారని ఖరాడీ చెప్పారు.
"అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి వస్తుండగా.. కొన్ని కార్లు మమ్మల్ని వెంబడించాయి. బిజెపి అభ్యర్థి (దంతా నియోజకవర్గం నుండి) లధు పర్ఘీ, మరో ఇద్దరు ఆయుధాలు, కత్తులతో వచ్చారు. మేము తప్పించుకోవాలి అనుకున్నాము, వెంటనే కార్ల నుంచి దిగి..అడవిలో 10-15 కిలోమీటర్లు పరిగెత్తాము. దాదాపు రెండు గంటల పాటు అడవిలోనే ఉన్నాము.అలా ప్రాణాలను కాపాడుకున్నాం" అని వెల్లడించారు. ఎన్నికల సంఘం (ఈసీ) మౌనాన్ని ప్రశ్నిస్తూ ఖరాడిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్నేష్ మేవానీ స్పందించారు. అదృశ్యమైన పార్టీ అభ్యర్థి గురించి తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. “దంతా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కాంతిభాయ్ ఖరాడిపై బీజేపీ అభ్యర్థి , అతని గూండాలు దాడి చేశారు, ఎన్నికల సమయంలో వివిధ గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలను కలిసి తిరిగి వస్తుండగా.. అతని కారును అడ్డగించి .. చంపే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కాంతిభాయ్ ఖరాడీ కనిపించలేదంటూ ట్వీట్ చేశారు.ఖరాడీ పై దాడి గురించి ఆందోళన చెందుతూ నాలుగు రోజుల క్రితం ఎన్నికల సంఘం అధికారికి లేఖ రాసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
కమిషన్ చర్యలు తీసుకుని ఉంటే.. ఈ దాడి జరిగేది కాదని అన్నారు. దంతా పోలీసులు అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యేను గుర్తించి వెనక్కి తీసుకొచ్చారు. తదుపరి విచారణ జరుగుతోంది. దంతా షెడ్యూల్డ్ తెగల వర్గాలకు రిజర్వ్ చేయబడిన స్థానం .ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున ఖరాడీ, బిజెపి నుండి లధు పర్ఘీ పోటీలో ఉన్నారు. రెండో విడత, చివరి దశలో రాష్ట్రంలోని 92 నియోజకవర్గాలతో పాటు ఈ స్థానానికి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఏదిఏమైనా తుది దశ పోలింగ్ జరుగుతోన్న సమయంలో బయటకు వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది.