Kamal Nath on BJP: "మీరు చదువుకున్న స్కూళ్లు, కాలేజీలు కట్టించింది మేమే": బీజేపీపై కమల్ నాధ్ ఫైర్
Kamal Nath on BJP: 70 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందన్న కాషాయ పార్టీ నేతల విమర్శలపై కాంగ్రెస్ నేత కమల్ నాధ్ దీటుగా బదులిచ్చారు. గతంలో తాము నిర్మించిన స్కూళ్లు, కాలేజీల్లో మీరు చదువుకున్నారని కాషాయ నేతలను ఉద్దేశించి కమల్ నాధ్ అన్నారు.
Kamal Nath on BJP: గత 70 ఏండ్లలో దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో పేర్కొంటూ బీజేపీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్లపై కాంగ్రెస్ నేత కమల్నాథ్ మండిపడ్డారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో అడిగే వారికి, మీరు చదువుకున్న పాఠశాల, కళాశాలలను నిర్మించింది కాంగ్రెస్ సర్కారేనని దీటుగా బదులిచ్చారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా దివంగత నేతకు నివాళులు అర్పిస్తూ కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి భారతదేశానికి నెహ్రూ పునాది వేశారనీ, ఎయిమ్స్, ఐఐటీ, ప్రముఖ స్కూళ్లు, కాలేజీలు నెహ్రూ తన హయాంలో నిర్మించారని గుర్తుచేశారు
పోషకాహార లోపం గురించి సీఎం శివరాజ్పై కమల్నాథ్ విమర్శలు
గత 17 ఏళ్లుగా మధ్యప్రదేశ్లో పౌష్టికాహారలోపం గణాంకాలు ఇంత భయానకంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎందుకు ఉందని మాజీ సీఎం కమల్నాథ్ ముఖ్యమంత్రి శివరాజ్ను ప్రశ్నించారు. పోషకాహార లోపంలో మధ్యప్రదేశ్ ఇప్పటికీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. పోషకాహార లోపాన్ని తొలగించే పేరుతో కోట్ల రూపాయాలను బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నారనీ, కానీ, నేటికీ రాష్ట్రంలోని వేలాది అంగన్వాడీలకు కరెంటు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య విద్య కిట్లను అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
మధ్యప్రదేశ్లో నేటికీ 10 లక్షల 32 వేల 166 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వీరిలో 6 లక్షల 30 వేల 90 మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని శివరాజ్ ప్రభుత్వం ఇటీవల విధానసభలో అంగీకరించిందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్లో ఇప్పటికీ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 42% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నేటికీ 1000 మంది శిశువుల్లో 33 మంది పుట్టిన 28 రోజుల తర్వాత మరణిస్తున్నారు. ఇది 17 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ ప్రగతి విమర్శించారు.
నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో నివాళులు అర్పించారు. పండిట్ నెహ్రూ దేశంలో కీలక వ్యవస్ధలను నిర్మిస్తే.. కాషాయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని రాహుల్ ఆరోపించారు. IIT, IIM, LIC, ITI, BHEL, NID, BARC, AIIMS, ISRO, ONGC, DRDO, వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను నెహ్రూ నిర్మించారని, నెహ్రూ జీ మన ప్రజాస్వామ్య మూలాలను పటిష్టం చేసిన సంస్థ నిర్మాతని కొనియాడారు. కానీ, 8 సంవత్సరాలలో.. BJP ప్రభుత్వం ఆ సంస్థలను బుల్డోజింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.